|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 10:15 PM
గయానా పార్లమెంట్లో ఆసక్తికర ఘటన చోటుచేుసుకుంది. ఓ చర్చ సందర్భంగా తన హిందీ భాషా పరిజ్ఞానం గురించి ప్రతిపక్ష ఎంపీ చేసిన విమర్శలకు భారత సంతతికి చెందిన వికాష్ రామ్కిసూన్ అనర్గళంగా ప్రసంగించి విమర్శకుల నోళ్లు మూయించారు. హిందీలో ఆయన ఇచ్చిన సమాధానంతో చర్చ ఊహించని మలుపు తిరిగింది. రామ్కిసూన్కు హిందీ అర్థం కాలేదని ప్రతిపక్ష సభ్యుడు విమర్శించడంతో వాగ్వాదం మొదలైంది. స్పీకర్ అనుమతి కోరుతూ.. ఆ వ్యాఖ్యపై నేరుగా ప్రస్తావించడానికి తాను హిందీలోనే స్పందిస్తానని రామ్కిసూన్ అన్నారు.
అనంతరం ఆయన సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రతిపక్ష సభ్యుని పేరు చెప్పి బహిరంగ సవాలు విసిరారు. తన ప్రత్యర్థి ఎంపిక చేసిన ఏ అంశంపైనైనా.. ఏ ప్రదేశంలోనైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. చర్చను టీవీ ఛానెల్లోనైనా నిర్వహించకోవచ్చని, నోట్స్ లేదా పేపర్లపై రాసి చదవకుండా పూర్తిగా హిందీలో మాట్లాడుతానని ఆయన అన్నారు. ‘టాపిక్, ప్లేస్ మీరు డిసైడ్ చేయండి.. నేను ఎటువంటి పేపర్ లేకుండా సమాధానం చెబుతాను’అని సవాల్ చేశారు.
తనకు హిందీలో ప్రావీణ్యం లేదనే వాదనలను తిప్పికొడుతూ.. ఆ భాషలో తాను స్వేచ్ఛగా మాట్లాడతానని ఆయన నొక్కి చెప్పారు. తన ప్రసంగంతో సభలోని ప్రజాప్రతినిధుల దృష్టిని రామ్కిసూన్ ఆకర్షించారు. అంతేకాదు, ఈ ప్రసంగం గయానా, విదేశాలలో ఉన్న భారత సంతతికి చెందిన సభ్యుల దృష్టిని త్వరగా ఆకర్షించింది. దీనికి సంబంధించిన వీడియోను గయానాలోని భారత హైకమిషన్ కార్యాలయం ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేయడంతో క్షణాల్లోనే సోషల్ మీడియా వైరల్గా మారింది. హిందీలో ఆయన ప్రసంగానికి ఫిదా అవుతున్నారు. గయానాలో భారత సంతతికి చెందిన జనాభా అధికంగా ఉన్నారు. ఇంగ్లీష్ ఆ దేశ అధికారిక భాష అయినప్పటికీ హిందీ సాంస్కృతికంగా ముఖ్యమైందిగా ఉంది.
వికాష్ రామ్కిసూన్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీకామ్, కామర్స్ అండ్ ఫైనార్స్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. హిందీపై తనకున్న పట్టు కేవలం అకడమిక్ పరంగానే కాదు తన సాంస్కృతిక గుర్తింపులో కూడా పాతుకుపోయిందని నొక్కి చెప్పారు. గతేడాది సెప్టెంబర్ 13న బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రామ్కిసూన్ భారత్, గయానా మధ్య సాంస్కృతిక వారధిగా తనను తాను మరింతగా నిలబెట్టుకున్నారు. ఇరు దేశాల ఉమ్మడి వారసత్వం, భాషా సంబంధాలను నొక్కి చెప్పారు.
Latest News