|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 10:21 PM
భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని చరిత్రాత్మక ముందడుగుగా డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం అభివర్ణించింది. 1.4 బిలియన్ల ప్రజల భారతీయ మార్కెట్ తలుపులు అమెరికా ఉత్పత్తుల కోసం తెరుచుకుంటాయని ఈ మేరకు వైట్హౌస్ ఒప్పందంలోకీ కీలక నిబంధనలను వెల్లడిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. వాణిజ్య ఒప్పందం అనంతరం భారత్పై విధించిన పరస్పర సుంకాలను 25 శాతం నుం,చి 18 శాతానికి తగ్గించేందుకు అమెరికా అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన ఒప్పందంలోని పలు అంశాలు ముఖ్యంగా అమెరికా వస్తువులపై సున్నా శాతం సుంకాలకు భారత్ అంగీకరించిందన్న డొనాల్డ్ ట్రంప్ వాదనపై స్పష్టత ఇచ్చింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లను నిలిపివేస్తామని భారత్ హామీ ఇవ్వడంతో అదనంగా విధించిన 25 శాతం సుంకాలను తొలగించడానికి ట్రంప్ అంగీకరించారని కూడా ఇది పేర్కొంది.
‘‘అమెరికా పారిశ్రామిక వస్తువులన్నింటిపైనా.. ఎర్ర జొన్న, తాజా, ప్రాసెస్ చేసిన పండ్లు, కొన్ని పప్పుధాన్యాలు, సోయాబీన్ ఆయిల్, వైన్, స్పిరిట్స్, అదనపు ఉత్పత్తులు వంటి విస్తృత శ్రేణి అమెరికా ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను ఎత్తివేయడానికి లేదా తగ్గించడానికి భారత్ అంగీకరించింది’’ అని వైట్హౌస్ తెలిపింది. మరిన్ని అమెరికా ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి, 500 బిలియన్ డాలర్లకు పైగా అమెరికా ఇంధనం, సమాచారం, కమ్యూనికేషన్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ కోల్, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి భారత్ కట్టుబడి ఉందని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రాధాన్యతా రంగాలలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రభావితం చేసే నాన్-టారిఫ్ అడ్డంకులను పరిష్కరించడానికి భారత్ అంగీకరించినట్టు వైట్హౌస్ ప్రకటన నొక్కి చెప్పింది. అలాగే, డిజిటల్ సేవల పన్నులను కూడా తొలగించనుందని, ద్వైపాక్షిక డిజిటల్ వాణిజ్యానికి ఉన్న ఇతర అడ్డంకులను పరిష్కరించే అంశాలపై చర్చలకు కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చినట్టు పేర్కొంది.
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచే ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. అమెరికా వస్తువులపై సుంకాలను సున్నా శాతానికి తగ్గించడానికి, టారీఫ్లపై అడ్డంకులను తొలగించడానికి భారత్ అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ట్రంప్ మధ్య ఫోన్లో జరిగిన చర్చల అనంతరం ఈ ప్రకటన వెలువడింది. చర్చల్లో పరస్పర వాణిజ్యంపై మధ్యంతర ఒప్పందం కోసం ఫ్రేమ్వర్క్ను రూపొందించాలని నిర్ణయించారు. అమెరికా-భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం పై విస్తృత చర్చలకు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఇదిలా ఉండగా.. అమెరికా వస్తువులపై సుంకాలను సున్నా శాతానికి తగ్గిస్తున్నట్టు భారత్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.
Latest News