|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 07:35 PM
అనకాపల్లి (కళ్యాణపులోవ), ఫిబ్రవరి 11: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్తకోట పోలీస్ స్టేషన్ పరిధిలోని కళ్యాణపులోవ శ్రీ పోతురాజు బాబు (శివ) ఆలయ జాతర మహోత్సవాలకు జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరి 15 నుండి 17 వరకు జరిగే ఈ ఉత్సవాల భద్రతను జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ ఏడాది సుమారు 2 నుండి 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, తొక్కిసలాట జరగకుండా ప్రత్యేక క్యూ లైన్లు, ఎంట్రీ మరియు ఎగ్జిట్ గేట్లను ఏర్పాటు చేశారు.దొండపూడి చెక్ పోస్ట్ నుండి ఆలయం వరకు ఉన్న 8 కి.మీ. మేర ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. రోడ్డు విస్తరణ కారణంగా ఈసారి 70 RTC బస్సులు నేరుగా ఆలయం వరకు వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు.
భక్తుల పుణ్యస్నానాల కోసం 9 ఘాట్లు సిద్ధం చేశారు. ప్రమాద నివారణకు 10 మంది గజ ఈతగాళ్లు, 5 బోట్లు, లైఫ్ జాకెట్లు మరియు తాడులతో నిరంతర పర్యవేక్షణ ఉంటుంది.
జాతర ప్రాంగణమంతా CCTV కెమెరాల నిఘాలో ఉంటుంది. వీటిని ప్రత్యేక కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేసి, ప్రతి కదలికను నిశితంగా గమనిస్తున్నారు.చోడవరం ఎమ్మెల్యే గారి సహకారంతో 48 ఎకరాల స్థలాన్ని భక్తుల కోసం సిద్ధం చేశారు. 28 ఉచిత భోజన శాలలు, మహిళల కోసం ప్రత్యేక మొబైల్ టాయిలెట్లు మరియు డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఏర్పాటు చేశారు.
"భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ శాంతియుతంగా దర్శనం చేసుకోవాలి. ముఖ్యంగా స్నాన ఘట్టాల వద్ద మహిళలు, పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి. దొంగతనాల నివారణకు ప్రత్యేక బృందాలను (L&O మరియు క్రైమ్) నియమించాం. ఏదైనా అత్యవసర పరిస్థితిలో 100 లేదా 112 నంబర్లకు సమాచారం అందించండి."
ఈ పర్యవేక్షణలో ఎస్.బి డీఎస్పీ శ్రీ జి.ఆర్.ఆర్.మోహన్, అనకాపల్లి డీఎస్పీ శ్రీమతి ఎం.శ్రావణి, ఎస్.బి ఇన్స్పెక్టర్ శ్రీ ఎస్.బాల సూర్యరావు, కొత్తకోట సిఐ శ్రీ జీ.కోటేశ్వరరావు, ఎస్సై ఎం.శ్రీనివాస్ మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Latest News