|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 07:43 PM
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలతో కలిసి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. రోజూ ఏడుగురు ఎమ్మెల్యేలతో మాట్లాడాలని నారా లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజూలూ ఈ కార్యక్రమం కొనసాగనుంది. ప్రతి రోజూ సాయంత్రం ఒక్కో జిల్లాకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలతో నారా లోకేష్ డిన్నర్ చేయాలని నిర్ణయించారు. నారా లోకేష్తో జరిగే ఈ డిన్నర్ మీట్లో ఎమ్మెల్యేలతో పాటుగా వారి కుటుంబసభ్యులు కూడా హాజరుకానున్నారు. ఈ భేటీ సందర్బంగా ఆయా నియోజకవర్గాలలోని సమస్యలపై చర్చించేందుకు వీలు కలగనుంది. అలాగే ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడే అవకాశం లభిస్తుందని నారా లోకేష్ భావిస్తున్నారు. గురువారం నుంచే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. రేపు మచిలీపట్నం జిల్లా ఎమ్మెల్యేలతో నారా లోకేష్ డిన్నర్ మీట్ నిర్వహించనున్నారు.
మార్చి 7వ తేదీ వరకూ ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
మరోవైపు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి ఏడో తేదీ వరకూ జరగనున్నాయి. బుధవారం రోజు జరిగిన బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై ఈ నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే సమావేశాలు పొడిగించనున్నారు. ఫిబ్రవరి 14న ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 17, 18 తేదీల్లో బడ్జెట్పై చర్చ ఉంటుంది. మహాశివరాత్రి నేపథ్యంలో ఫిబ్రవరి16న సెలవు ఉంటుంది. ఫిబ్రవరి 18న బడ్జెట్ మీద ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం ఇస్తారు.
మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కూటమి ఎమ్మె్ల్యేలకు సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో మాట్లాడిన ఆయన..కూటమి ఐక్యత క్షేత్రస్థాయిలోనూ ఉండాలన్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేల పనితీరుపై మాట్లాడతానని.. 40 మందితో వ్యక్తిగతంగా మాట్లాడతానని అన్నారు. ఆవు కథలు చెప్పటం మాని సబ్జెక్ట్ మీద పూర్తిగా సన్నద్ధమై సభకు రావాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఎవరేం మాట్లాడుతున్నారనే విషయాలను నోట్ చేసుకుంటానని చంద్రబాబు తెలిపారు.
Latest News