|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 07:54 PM
సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వార్తలు. వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని వాస్తవాలు ఉంటే మరికొన్ని తప్పు దోవ పట్టించేవిగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఏపీలోని అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో జరిగినట్లుగా చెప్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1014 వాహనాలను ధ్వంసం చేస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో నాలుగు 104 వాహనాలను మరమ్మత్తులు ఉన్నాయనే కారణంతో పక్కనపెట్టినట్లు సమాచారం. అయితే ఈ నాలుగు 104 వాహనాలు అక్కడి నుంచి మాయమయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. 104 వాహనాలు కనిపించకుండా పోవటంపై జిల్లా వైద్యాధికారి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. 104 వాహనాలు చోరీ చేశారంటూ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
అయితే తాజాగా 104 వాహనాలను డంపింగ్ యార్డులో ధ్వంసం చేస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొంతమంది వీటిని అనుమతి లేకుండానే డంపింగ్ యార్డుకు తరలించారని ఆరోపణలు వస్తున్నాయి. 104 వాహనాలను డంపింగ్ యార్డులో ధ్వంసం చేసి వాటి విడిభాగాలను అమ్ముకున్నారని ఆరోపిస్తూ వీడియోను వైరల్ చేస్తున్నారు. అయితే దీని వెనుక వాస్తవాలను ప్రభుత్వ అధికారులు వెల్లడించాల్సి ఉంది. పోలీసులు ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే అనుమతి లేకుండా 104 వాహనాలను డంపింగ్ యార్డుకు ఎలా తరలించారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోకి సంచార వైద్య సేవలను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ 104 వాహన సేవలు ప్రారంభించారు. మారుమూల ప్రాంతాలలో నివశించే మహిళలు, గర్భిణులు, వృద్ధులు, చిన్నారులకు సేవలకు అందించేవారు.
అలాగే బీపీ, షుగర్, దగ్గు, దమ్ము, ఆయాసం వంటి వ్యాధులకు ఔషధాలు అందించటంతో పాటుగా సీజనల్ వ్యాధులకు సంబంధించిన వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా చేసేవారు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 20వ తేదీ వరకూ.. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలలో ఈ 104 వాహనాలు సేవలు అందించేవి. వైద్యపరీక్షలు చేయటంతో పాటుగా.. ఉచితంగా మందులు కూడా అందించేవారు.
Latest News