|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 11:14 PM
సామాన్య ప్రజలు తాము సంపాదించే దాంట్లోంచి కొంత పొదుపు చేసుకునేందుకు ప్రస్తుతం చాలా రకాల చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఉన్నాయి. అయితే, అందులో కొన్ని ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసేవి, లాంగ్ టర్మ్ స్కీమ్స్ ఉంటాయి. అయితే, నెల నెలా పొదుపు చేసుకుని, తక్కువ కాలంలోనే చేతికి డబ్బులు వచ్చే స్కీమ్ ఒకటి పోస్టాఫీసులో అందుబాటులో ఉంది. నెల నెల చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టి ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకోవచ్చు. అదే పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ . దీనికి కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకానికి కేంద్రం మంచి వడ్డీ రేటు ఇస్తోంది.
పోస్టాఫీసు అందిస్తోన్న చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి. ఈ స్కీమ్లో చేరి నెల నెలా తమకు నచ్చినట్లుగా చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకోవచ్చు. కనీసం రూ.100 నుంచి పెట్టుబడి మొదలు పెట్టవచ్చు. గరిష్ఠంగా ఎంతైనా పొదుపు చేయవచ్చు. ప్రస్తుతం 2026 జనవరి- ఫిబ్రవరి త్రైమాసికానికి 6.7 శాతం వడ్డీ అందిస్తోంది కేంద్రం. పోస్టాఫీస్ ఆర్డీ స్కీమ్ మెచ్యూరిటీ టర్మ్ 5 సంవత్సరాలుగా ఉంటుంది. కాల వ్యవధి ముగిసిన తర్వాత మరో 5 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. ఈ పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది. కొన్నిసార్లు పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు లేదా యథాతథంగా కొనసాగించవచ్చు. చాలా కాలంగా వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగుతున్నాయి.
పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ అకౌంట్ తీసుకుని నెల నెలా రూ.100, రూ.500 చొప్పున జమ చేస్తున్నారు అనుకుందాం. ఆర్డీ స్కీమ్ మెచ్యూరిటీ కాల వ్యవధి అనేది 5 ఏళ్లు ఉంటుంది. అంటే మీరు 5 సంవత్సరాల పాటు నెల నెలా పొదుపు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇందులో 6.7 శాతం వడ్డీ ఇస్తున్నారు. 5 సంవత్సరాల పాటు నెలకు రూ.100 జమ చేస్తే మీ పెట్టుబడి మొత్తం రూ.6000 అవుతుంది. దానిపై వడ్డీ రూ.1136 వరకు వస్తాయి. మొత్తం చేతికి రూ.7,136 వరకు వస్తాయి. మీరు మరో 5 ఏళ్ల పాటు ఈ స్కీమ్ పొడిగించి పెట్టుబడి కొనసాగిస్తే అప్పుడు మీ చేతికి రూ. 17,085 వరకు లభిస్తాయి.
ఇక మీరు నెలకు రూ.500 జమ చేసినట్లయితే 5 సంవత్సరాల మెచ్యూరిటీ తర్వాత పెట్టుబడి మొత్తం రూ.30 వేలు అవుతుంది. దీనిపై వడ్డీ రూ.5680 వరకు వస్తుంది. అంటే మొత్తం రూ.35680 వరకు లభిస్తాయి. మరో 5 ఏళ్లు పొడగిస్తే అప్పుడు అసలు, వడ్డీ కలిపి చేతికి రూ. 85,427 వరకు లభిస్తుంది.