|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 05:20 PM
నేలలో తేమ పరిమితికి మించి ఉండటం వల్ల కూరగాయల తోటల్లో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా నారు దశలోనే మొక్కలు కుళ్లిపోవడం (నారుకుళ్లు), ఎదుగుదల మందగించడం వంటివి జరుగుతాయి. దీనివల్ల మొక్కలు గట్టిపడకముందే చనిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, పూత విపరీతంగా రాలిపోవడం వల్ల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఎండు తెగులు, ఆకుమచ్చ తెగులు కూడా తోటలను ఆశించి రైతులను నష్టాల్లోకి నెట్టే అవకాశం ఉంది.
కూరగాయలతో పాటు ఆకుకూరలు, దుంప జాతి పంటలపై కూడా ఈ అధిక తేమ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆకుకూరల్లో మొక్క మొదలు కుళ్లిపోవడం, ఆకుతినే పురుగులు ఆశించడం వల్ల ఆకులు నాణ్యత కోల్పోతాయి. ఇక దుంప జాతుల్లో నేల లోపల ఉండే దుంపలు కుళ్లిపోయే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు మొక్క కేవలం ఆకులు, కొమ్మలకే పరిమితమై (అధిక శాఖీయోత్పత్తి), దుంప ఊరకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
అధిక తేమ వల్ల కేవలం శిలీంధ్రాలే కాకుండా బ్యాక్టీరియా ముచ్చ తెగులు, బూడిద తెగులు వంటివి కూడా వ్యాపిస్తాయి. ఆకులు పసుపు రంగులోకి మారిపోయి కిరణజన్య సంయోగక్రియ మందగిస్తుంది. అక్షింతల పురుగు వంటి కీటకాలు ఆకులను తినడం వల్ల పంట వికృతంగా మారుతుంది. ముఖ్యంగా కాయలు కుళ్లిపోవడం (కాయకుళ్లు) వల్ల మార్కెట్లో ఆశించిన ధర లభించక రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
పండ్ల తోటల విషయంలో కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలి. బత్తాయి, నిమ్మ, ద్రాక్ష, జామ మరియు మామిడి వంటి తోటల్లో అధిక తేమ వల్ల వేరు కుళ్లు సమస్య ఎక్కువగా ఉంటుంది. నీరు నిల్వ ఉండటం వల్ల వేర్లకు గాలి అందక మొక్కలు బలహీనపడతాయి. పండ్ల తోటల్లో చీడపీడల ఉధృతి పెరగకుండా ఉండాలంటే, తోటలో అదనంగా ఉన్న నీటిని బయటకు పంపేలా మురుగునీటి పారుదల సౌకర్యం కల్పించడం చాలా ముఖ్యం.