|
|
by Suryaa Desk | Tue, Feb 24, 2026, 06:21 PM
కంప్యూటర్ సైన్స్ చదివిన ఓ వ్యక్తి.. దారి తప్పి గంజాయి స్మగ్లర్గా మారిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీసులు ఇటీవల కొంతమంది గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా మీదుగా గంజాయి రవాణా జరుగుతున్నట్లు నర్సీపట్నం పోలీసులకు సమాచారం అందింది. దీంతో తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. వాహనాలలో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 80 ప్యాకెట్లలో నిలువ చేసిన 160 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు బొలెరో వాహనాలు, ఒక కారు, బైక్, తొమ్మిది సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.1.19 కోట్లు ఉండొచ్చని పోలీసుల అంచనా.
మరోవైపు ఈ కేసుకు సంబంధించిన వివరాలను నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలోని సైదులుపేటకు చెందిన హరిబాబు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. కంప్యూటర్స్ సైన్స్ వరకూ చదివిన హరిబాబు.. గంజాయితో పోలీసులకు దొరికిపోయి 2018లో తొలిసారిగా జైలుకు వెళ్లాడు. జైలులో గంజాయి నిందితులతో హరిబాబుకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం సాయంతో వారంతా కలిసి ముఠాగా ఏర్పడ్డారు. జైలు నుంచి విడుదలైన తర్వాత రెండు బొలెరో వాహనాలను కొనుగోలు చేయించాడు హరిబాబు. ఆ తర్వాత ఆ బొలెరోలలో ఎవరికీ కనిపించకుండా ఉండేలా రహస్య అరలు ఏర్పాటు చేయించాడు.
ఆ తర్వాత హరిబాబు తన వ్యాపారం మొదలుపెట్టాడు. గంజాయిని ఒడిశాలో కొనుగోలు చేయటం, బొలెరోలలోని రహస్య అరలలో వాటిని దాచి అక్రమంగా సరఫరా చేయటం ప్రారంభించారు. ఎవరికీ అనుమానం రాకుండా పైన కూరగాయలు ఉంచి.. లోపల మాత్రం గంజాయి ప్యాకెట్లు ఉంచి రవాణా చేయటం ప్రారంభించారు. ఈ రకంగా పోలీసులను మస్కా కొట్టి ఇప్పటి వరకూ 12 సార్లు గంజాయి రవాణా చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితేఈ సారి మాత్రం అతని ఎత్తులు పారలేదు.
తమిళనాడులోని దిండిగల్కు గంజాయి తరలిస్తూ నర్సీపట్నం పోలీసులకు హరిబాబు ముఠా దొరికిపోయింది. ఐదుగురు సభ్యులు పోలీసులకు దొరకగా.. ఇద్దరు పరారయ్యారు. పరారైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఒడిశా నుంచి గంజాయిని తీసుకువస్తూ నాతవరం మండలం వెదురుపల్లి వద్ద దొరికినట్లు పోలీసులు వెల్లడించారు.
Latest News