|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 03:03 PM
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే మాట మరోసారి రుజువవుతోంది. ఒకప్పుడు ఒక పార్టీ తరపున ముఖ్యమంత్రిగా రాష్ట్ర గమనాన్ని శాసించిన నేతలు సైతం, మారుతున్న సమీకరణాల దృష్ట్యా తమ రాజకీయ భవిష్యత్తు కోసం గూడు మార్చడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. సిద్ధాంతాల కంటే అవకాశవాదమే రాజకీయాలకు ఊపిరిగా మారుతున్న తరుణంలో, ఈ వలసలు అటు పార్టీల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.
తాజాగా తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పు చోటుచేసుకుంది. అన్నాడీఎంకే (AIADMK)లో కీలక నేతగా, మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఓ. పన్నీర్ సెల్వం అనూహ్యంగా ప్రత్యర్థి పార్టీ అయిన డీఎంకే (DMK) తీర్థం పుచ్చుకోవడం చర్చనీయాంశమైంది. అన్నాడీఎంకేలో అంతర్గత విభేదాలు, నాయకత్వ పోరు ముదిరిన నేపథ్యంలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం తమిళనాట రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. పదవుల కోసం దశాబ్దాల వైరాన్ని పక్కనపెట్టి ప్రత్యర్థి పక్షాన చేరడం ఆయన అనుచరులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కేవలం దక్షిణాదిలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన అశోక్ చవాన్ (మహారాష్ట్ర), కిరణ్ కుమార్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్), కెప్టెన్ అమరీందర్ సింగ్ (పంజాబ్) వంటి దిగ్గజ నేతలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. అలాగే జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM)లో కీలక పాత్ర పోషించి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంపై సోరెన్ కూడా కమలం గూటికి చేరారు. వీరంతా తమ మాతృ సంస్థలను వీడి ప్రత్యర్థి పార్టీలో చేరడం వెనుక అధికార దాహం ఉందా లేక రాజకీయ అనివార్యత ఉందా అన్నది విశ్లేషకుల ముందున్న ప్రశ్న.
కర్ణాటక వంటి రాష్ట్రాల్లో గూడు మార్పులు మరిన్ని మలుపులు తిరుగుతున్నాయి. బీజేపీ నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగదీశ్ షెట్టర్, గత ఎన్నికల సమయంలో టికెట్ రాలేదన్న అసంతృప్తితో కాంగ్రెస్లో చేరినప్పటికీ, ఏడాది తిరగకముందే మళ్లీ సొంతగూటికే (బీజేపీ) చేరుకోవడం గమనార్హం. ఇలా పదవులు, అవకాశాలే ప్రాతిపదికగా సాగుతున్న ఈ జంపింగ్లు ప్రజాస్వామ్యంలో ఓటర్ల నమ్మకాన్ని పరీక్షకు గురిచేస్తున్నాయి. అధికారం కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టే ఈ సంస్కృతి రానున్న రోజుల్లో మరెన్ని మార్పులకు వేదికవుతుందో వేచి చూడాలి.