|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 03:46 PM
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంలో తాను జోక్యం చేసుకోబోనని స్పష్టం చేస్తూనే, పాకిస్థాన్ వైపు స్పష్టంగా మొగ్గు చూపారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్లను గొప్ప నాయకులుగా అభివర్ణిస్తూ వారిపై ప్రశంసలు కురిపించారు.ఆఫ్ఘనిస్థాన్లోని 29 ప్రాంతాలపై వైమానిక దాడులు చేసి, యుద్ధ వాతావరణాన్ని ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ దాడుల్లో 297 మంది ఆఫ్ఘన్ తాలిబన్లు, ఇతర మిలిటెంట్లు మరణించారని పాకిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి ప్రకటించారు. అయితే, పాకిస్థాన్కు చెందిన 55 మంది సైనికులను హతమార్చామని, పలువురిని బందీలుగా పట్టుకున్నామని తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ప్రకటించారు. 2021లో అమెరికా సేనల ఉపసంహరణ తర్వాత తాలిబన్లు అధికారంలోకి వచ్చాక, పాకిస్థాన్ జరిపిన అత్యంత భారీ దాడులు ఇవే కావడం గమనార్హం.ఈ పరిణామాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ, "నేను జోక్యం చేసుకునేవాడిని, కానీ మీకు అక్కడ గొప్ప ప్రధాని, గొప్ప ఆర్మీ చీఫ్ జనరల్ ఉన్నారు. నేను ఎంతో గౌరవించే వారిలో ఆ ఇద్దరూ ఉన్నారు. పాకిస్థాన్ అద్భుతంగా పనిచేస్తోందని నేను భావిస్తున్నాను" అని అన్నారు. మరోవైపు తాలిబన్ల దాడుల నుంచి తనను తాను రక్షించుకునే హక్కు పాకిస్థాన్కు ఉందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.
Latest News