|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 06:16 PM
కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెంలోని ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో 20 మంది వరకూ చనిపోయినట్లు సమాచారం. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేట్లపాలెం- జి. మేడిపాడు మధ్యన ఉన్న సూర్య శ్రీ ఫైర్ వర్క్స్ అనే బాణాసంచా తయారీ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే మధ్యాహ్న భోజనం సమయం కావటంతో మరికొందరు ప్రాణాలతో బయటపడినట్లు తెలిసింది. వరిపొలాల్లో 6 షెడ్లు వేసి బాణాసంచా తయారు చేస్తున్నారు. అయితే పేలుడుకు ముందు కొంతమంది కార్మికులు భోజనం కోసం బయటకు వెళ్లినట్లు తెలిసింది. దీంతో వీరందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారు.
పేలుడు కారణంగా భారీ శబ్ధం వచ్చినట్లు స్థానికులు చెప్తున్నారు. సుమారు ఐదు కిలోమీటర్ల వరకూ ఈ శబ్ధం వినిపించిందని చెప్తున్నారు. పేలుడుతో చుట్టుపక్కల గ్రామాల వాసులు కూడా భయాందోళనకు గురయ్యారు. పేలుడు కారణంగా మృతదేహాలు పంటపొలాల్లో చెల్లాచెదురుగా పడిపోయాయి. కొన్ని పూర్తిగా కాలిపోయిన పరిస్థితి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. అయితే పరిమితికి మించి బాణాసంచా తయారు చేయటమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.
వైఎస్ జగన్ దిగ్భ్రాంతి..
"కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటన తీవ్రంగా కలిచివేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన పరిహారం ప్రకటించి అండగా నిలవాలి. గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా." అంటూ జగన్ ట్వీట్ చేశారు
మాటలకు అందని విషాదం.. నారా లోకేష్
"కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సమాచారం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. పలువురు మృత్యువాత పడటం మాటలకు అందని విషాదం. మృతులకు నివాళులు అర్పిస్తున్నాను. మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తాం." అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.