|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 07:44 PM
ప్రస్తుతంపాకిస్థాన్, అఫ్గనిస్థాన్ మధ్య కొనసాగుతోన్న ఘర్షణల్లోజోక్యం చేసుకోడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించారు. ఇదే సమయంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్లు గొప్ప వ్యక్తులని ట్రంప్ ప్రశంసలు కురిపించారు. అఫ్గన్పై దాడుల గురించి అడిగిన ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు స్పందిస్తూ.. ‘‘నేను (జోక్యం చేసుకుంటాను), కానీ అక్కడ గొప్ప ప్రధాని ఉన్నారు, అక్కడ గొప్ప జనరల్ ఉన్నారు.. వారు ఇద్దరూ నేను నిజంగా గౌరవించే వ్యక్తులు అని అనుకుంటున్నాను. పాకిస్థాన్ అద్భుతంగా బాగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను’’ అని వ్యాఖ్యానించారు.
అఫ్గన్తో బహిరంగ యుద్ధం ప్రారంభమైందన్న పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో ట్రంప్ నుంచి ఈ స్పందన వచ్చింది. కాబూల్, కాందహార్ సహా అఫ్గన్లోని 29 ప్రాంతాల్లో దాడులు చేసినట్టు పాకిస్థాన్ శుక్రవారం ప్రకటించింది. ఈ దాడుల్లో తాలిబన్లు, ఉగ్రవాదులు సహా 297 మంది హతమయ్యారని తెలిపింది. అయితే, అటు తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జుబినుల్లాహ్ ముజాహిద్ సైతం తాము 55 మంది పాకిస్థాన్ సైనికులను హతమార్చామని, అనేక మందిని బందీలుగా పట్టుకున్నామని పేర్కొన్నారు. అఫ్గన్లో తాలిబన్లు 2021లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేశంపై పాక్ జరిపిన అతిపెద్ద దాడి ఇదే.
శుక్రవారం దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. దురాక్రమణదారులను తమ బలగాలు అణిచివేయగలవని అన్నారు. ‘ఏదైనా దుందుడుకు చర్యలను అడ్డుకునే పూర్తి సామర్థ్యం మా దళాలకు ఉంది. పాకిస్థాన్ సాయుధ దళాలకు దేశం మొత్తం అండగా నిలుస్తుంద’ అని ఆయన అన్నారు.
అయితే, అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాత్రం.. తాలిబన్ల దాడుల నుంచి తనను తాను రక్షించుకునే హక్కు పాకిస్థాన్కు ఉందని, దీనికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. అలాగే, ఉగ్రవాద నిరోధక చర్యల్లో తాలిబన్ల విధానాలపై విమర్శలు గుప్పించారు. ‘‘ఉగ్రవాదాన్ని నిరోధించడంలో తాలిబన్లు తమ నిబద్ధతను నిలబెట్టుకోవడంలో నిరంతరం విఫలమవుతున్నారు.. హింస ఈ ప్రాంతాన్ని అస్థిరపరిచేందుకు అవకాశం కల్పించింది.. అయితే ఉగ్రవాద సమూహాలు తమ దాడులకు అఫ్గన్ను లాంచ్ ప్యాడ్గా మార్చుకుంటున్నాయి’’ ఆయన ఆరోపించారు.
ఇదిలా ఉండగా, ఇదిలా ఉండగా, బ్రిటన్, చైనాలు మాత్రం పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య ఉద్రిక్తతల పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి. ఇరు దేశాలూ సంయమనం పాటించాలని కోరాయి. కాల్పుల విరమణకు తాము మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపాయి. అటు, పాకిస్థాన్లోని తమ పౌరులకు అమెరికా ఎంబసీ, కాన్సులేట్లు హెచ్చరికలు చేశాయి. సైనిక స్థావరాలు, శాంతిభద్రతల విభాగాలు, భారీ వాణిజ్య సముదాయాలను ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని, ఆ ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించాయి.
Latest News