|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 10:38 PM
భారత దేశీయ క్రికెట్ చరిత్రలో జమ్మూ కశ్మీర్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. తొలిసారి రంజీ ట్రోఫీ కిరీటాన్ని గెలుచుకొని దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఎన్నో ఏళ్లుగా రాజకీయ, సామాజిక సవాళ్ల మధ్య సాగిన ఈ రాష్ట్రానికి, ఈ విజయం ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. ఫిబ్రవరి 28న మధ్యాహ్నం 2.11 గంటలకు కెప్టెన్లు హ్యాండ్షేక్ చేసుకున్న క్షణంతో ఫలితం అధికారికమైంది. తొలి ఇన్నింగ్స్లో 291 పరుగుల భారీ ఆధిక్యంతో జమ్మూకశ్మీర్ జట్టు ఛాంపియన్గా నిలిచింది. 91వ సీజన్ రంజీ ట్రోఫీలో ఇది వారి తొలి టైటిల్ కావడం విశేషం.
ఫైనల్లో జమ్మూ కశ్మీర్ దాడికి కర్ణాటక నిలబడలేకపోయింది. పోరాడతామని చెప్పినప్పటికీ చివరి రోజున కర్ణాటక పెద్దగా పోరాటం చూపలేకపోయింది. తొలి ఇన్నింగ్స్లో 160 పరుగులు చేసిన మయాంక అగర్వాల్ జట్టుకు ప్రధాన అండగా నిలిచినా, ఫలితం లేకుండా పోయింది. పిచ్ స్లోగా ఉండటం, బౌలర్లకు అనుకూలంగా లేకపోవడంతో కర్ణాటక ఆశలు క్రమంగా కరిగిపోయాయి. ఉదయం సెషన్లోనే కేఎల్ రాహుల్తో బౌలింగ్ చేయించటం కర్ణాటక పరిస్థితిని ప్రతిబింబించింది. ప్రధాన పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా చివరి రోజు బౌలింగ్కు రాకపోవడం గమనార్హం.
చివరి రోజుకు 477 పరుగుల ఆధిక్యంతో దిగిన జమ్మూ కశ్మీర్ బ్యాటర్లు మ్యాచ్ను ఫార్మాలిటీగా ముగించారు. కమ్రాన్ ఇక్బాల్ అజేయంగా 160 పరుగులు చేయగా, సాహిల్ లోత్రా 101 పరుగులతో శతకం సాధించాడు. దీంతో మళ్లీ బౌలింగ్ చేయాల్సిన అవసరం లేకుండా జట్టు విజయాన్ని ఖరారు చేసుకుంది.
ఈ టోర్నీలో జమ్మూ కశ్మీర్ దేశవ్యాప్తంగా బలమైన జట్లను ఓడించింది. ముంబై, ఢిల్లీ, మధ్యప్రదేశ్, బెంగాల్ లాంటి హేమాహేమీ జట్లను మట్టికరించి కశ్మీర్ ఫైనల్కు చేరింది. బౌలింగ్లో ప్రధాన పాత్ర పోషించిన ఆకిబ్ నబీ నాకౌట్ దశల్లో ఐదు వికెట్లతో నాలుగు సార్లు మెరిసి, సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు.
జట్టు కెప్టెన్ పరాస్ డోగ్రా కూడా ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 24 ఏళ్ల కెరీర్లో మూడు జట్లకు ప్రాతినిధ్యం వహించి, 10 వేలకుపైగా పరుగులు చేసిన తర్వాత తొలి రంజీ టైటిల్ అందుకోవడం అతడి ప్రయాణానికి మకుటంగా నిలిచింది. మొత్తంగా చూస్తే జమ్మూ కశ్మీర్ ఆల్రౌండ్ షోతో ఛాంపియన్గా నిలిచింది.