|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 10:49 PM
భారత స్టాక్ మార్కెట్లు కొంత కాలంగా తీవ్ర ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఐటీ స్టాక్స్లో అమ్మకాల ఒత్తిడితో నష్టాలు ఎదురవుతున్నాయి. శుక్రవారం సెషన్లో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ఏకంగా 961 పాయింట్లు పతనమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 318 పాయింట్లు తగ్గింది. కొద్ది రోజులుగా ఐటీ స్టాక్స్ భారీగా పడిపోతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఒక స్మాల్ క్యాప్ ఐటీ కేటగిరీ స్టాక్ మాత్రం వరుసగా పుంజుకుంటోంది. ఇప్పుడు శుక్రవారం సెషన్లోనూ పుంజుకుంది. ఏకంగా 5 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టింది.
అదే స్మాల్ క్యాప్ సైబర్ సెక్యూరిటీ ఐటీ స్టాక్ అసెడెర్ లిమిటెడ్. ఇది శుక్రవారం సెషన్లో 5 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టింది. గురువారం సెషన్లో రూ. 47.98 వద్ద ముగియగా శుక్రవారం రోజు 5 శాతం పెరిగి రూ. 50.37 వద్ద స్థిరపడింది. గత కొద్ది రోజులుగా కూడా ఈ స్టాక్ పుంజుకుంటోంది. అయితే ఈ స్టాక్ ఇంతలా పెరిగేందుకు ఒక కారణం ఉంది.
అసెడెర్ లిమిటెడ్ ఇటీవల 1:10 రేషియోలో బోనస్ ఇష్యూ ప్రకటించింది. ఇక్కడ 10 ఈక్విటీ షేర్లపై అదనంగా ఒక్కో షేరు ఉచితంగా అందనుంది. అంటే 100 ఈక్విటీ షేర్లపై 10 షేర్లు అదనంగా వస్తాయి. దీనికి అనుగుణంగా స్టాక్ ధర అడ్జస్ట్ అవుతుందని చెప్పొచ్చు. ఈ బోనస్ ఇష్యూకు రికార్డ్ తేదీని ఇప్పుడు ప్రకటించింది. 2026, మార్చి 6 రికార్డు డేట్గా ప్రకటించారు కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అంటే ఈ తేదీలోపు కంపెనీ షేర్లను కలిగి ఉన్న వారికి బోనస్ షేర్లు వర్తిస్తాయి.
ఈ కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 22.60 కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 97.46 గా ఉండగా.. కనిష్ఠ ధర రూ. 42.11 గా ఉంది. గత 5 రోజుల్లో ఈ స్టాక్ ధర 8 శాతానికిపైగా పెరగ్గా.. నెలలో మాత్రం 28 శాతం పడిపోయింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు చూస్తే 38 శాతానికిపైగా పతనమైంది. గత ఐదేళ్లలో మాత్రం 436 శాతం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 72 లక్షలుగా నమోదైంది. అంతకుముందుతో పోలిస్తే పెద్దగా ఆదాయం పెరగలేదు. రెండో త్రైమాసికంతో పోలిస్తే 27 శాతం తగ్గింది. కంపెనీ నికర నష్టం రూ. 1.8 లక్షలుగా నమోదైంది.
Latest News