|
|
by Suryaa Desk | Sun, Mar 01, 2026, 08:43 AM
స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది కొంత నిరాశ కలిగించే వార్త. ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు తమ మోడళ్ల ధరలను పెంచుతున్నాయి. ఇప్పటికే వివో, ఐకూ సంస్థలు ధరల పెంపును ప్రకటించగా, తాజాగా షియోమీకి చెందిన రెడ్మీ, పోకో బ్రాండ్లు కూడా ఇదే బాటలో పయనిస్తున్నట్లు సమాచారం. ఈ పెరిగిన ధరలు మార్చి 1 నుంచే అమల్లోకి వస్తున్నాయి. ధరల పెంపు వల్ల ఆయా స్మార్ట్ ఫోన్ ధరలు కనిష్ఠంగా రూ.1000 నుంచి గరిష్ఠంగా రూ.2500 వరకు పెరగనున్నాయి. టెక్ టిప్స్టర్ అభిషేక్ యాదవ్ పేర్కొన్న వివరాల ప్రకారం పోకో ఎంట్రీలెవల్ మోడల్ సీ 75 ప్రస్తుత ధర 4 జీబీ ప్లస్ 64 జీబీ వేరియంట్ ధర రూ.8,499 కాగా, ఇకపై రూ.10,999 విక్రయించనున్నారు. 4 ప్లస్ 128 జీబీ మోడల్ ధర రూ.2వేలు పెరగనుంది. వీటి మాదిరిగానే పోకో ఎం7, సీ 85 5 జీ, పోకో ఎం 7 ప్లస్ 5 జీ, పోకో ఎఫ్ 7 5 జీ మోడళ్లపై వేరియంట్ ను బట్టి రూ.1000ల నుంచి రూ.2వేల వరకు పెంచుతున్నట్లు పోకో పేర్కొంది. రెడ్ మీ కూడా ఇదే స్థాయిలో ధరలు పెంచనుందని సమాచారం. సవరించిన ధరలు మార్చి 1 నుంచే అమల్లోకి రానున్నాయి. ధరల పెరుగుదల కారణం విషయానికి వస్తే ప్రధానంగా ఏఐ డేటా సెంటర్ల నుంచి విపరీతమైన డిమాండ్ కారణంగా అంతర్జాతీయంగా మెమొరీ చిప్ ల కొరత ఏర్పడింది. దీంతో మొబైల్ తయారీ ఖర్చు పెరుగుతోంది. దీంతో మార్చి 1 నుంచి చైనాకు చెందిన వివో, దాని అనుబంధ ఐకూ స్మార్ట్ ఫోన్ ధరలు పెంచాయి. మరోవైపు శాంసంగ్ కూడా ఎఫ్ 17, ఏ 36, ఏ 56 స్మార్ట్ ఫోన్ ధరలను రూ.2వేల వరకు పెంపు చేసింది.
Latest News