|
|
by Suryaa Desk | Sun, Mar 01, 2026, 02:22 PM
బారామతి విమాన ప్రమాద దర్ఘటనపై విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. నెల రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ సహా ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.ప్రమాదం జరిగిన సమయంలో బారామతిలో విజిబిలిటీ తక్కువగా ఉందని, రన్వేపై మార్కింగులు మసకబారాయని నివేదిక పేర్కొంది. అక్కడ కంకర కూడా ఉన్నట్లు గుర్తించింది. ఈ క్రమంలో అనియంత్రిత ఎయిర్ ఫీల్డులు భద్రతా ప్రమాణాలు పాటించేలా సంబంధిత వర్గాలకు డీజీసీఏ సూచనలు చేయాలని ఏఏఐబీ సిఫార్సు చేసింది.ఆరోజు కంట్రోల్ టవర్ను ఎఫ్టీవోలోని ఓ గ్రౌండ్ ఇన్స్ట్రక్టర్ నడిపించారని, ల్యాండింగ్ సమయంలో పైలట్లతో కమ్యూనికేట్ చేశారని నివేదికలో ఏఏఐబీ పేర్కొంది. విమానం రన్ వేను సమీపిస్తున్న సమయంలో పైలట్లు విజిబిలిటీ గురించి ఆరా తీశారని తెలిపింది. 3,000 మీటర్లుగా ఉందని టవర్ నుంచి సమాధానం వచ్చిందని పేర్కొంది.ఆ తర్వాత ల్యాండింగ్కు క్లియరెన్స్ వచ్చిందని, అయితే వీఎఫ్ఆర్ ఆధారిత విమానానికి ల్యాండింగ్ కోసం కనిష్ఠంగా 5,000 మీటర్ల విజిబిలిటీ అవసరమని పేర్కొంది. ప్రమాద సమయంలో ఇది తక్కువగా ఉందని తెలిపింది. రన్ వే రీకార్పెటింగ్ పనులు కూడా చివరిసారి 2016లో చేశారని, దీనితో మార్కింగ్స్ మసకబారినట్లు పేర్కొంది. రన్ వేపై కంకర రాళ్లు కూడా గుర్తించినట్లు తెలిపింది.బారామతి విమాన ప్రమాద ఘటనలో కాక్ పిట్ వాయిస్ రికార్డర్ ధ్వంసమైందని, ఈ క్రమంలో నేషనల్ ట్రాన్స్ పోర్టు సేఫ్టీ బోర్డు సాయంతో సాలిడ్ స్టేట్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ నుంచి డేటాను డౌన్ లోడ్ చేస్తామని, దానిని విశ్లేషిస్తామని ఏఏఐబీ తెలిపింది.
Latest News