ఏపీ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో సెమీ రింగ్ రోడ్డు
 

by Suryaa Desk | Sun, Mar 15, 2026, 06:09 PM

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో సెమీ రింగ్ రోడ్డు నిర్మాణం దిశగా అడుగులు వేస్తోంది. విశాఖలో సెమీ రింగ్ రోడ్డు నిర్మాణంపై వీఎంఆర్డీఏ ఇప్పటికే అధ్యయనం మొదలుపెట్టింది. ఈ విషయాన్ని ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. విశాఖలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు సెమీ రింగ్ రోడ్డు నిర్మిస్తామని తెలిపారు. విశాఖపట్నం వేదికగా పట్టణ గృహ నిర్మాణశాఖపై రీజినల్‌ వర్క్‌షాప్‌ జరిగింది. ఈ వర్క్ షాపులో మంత్రి నారాయణ పాల్గొన్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడిన మంత్రి నారాయణ.. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు త్వరలోనే కేంద్రం నుంచి అనుమతులు వస్తాయన్నారు. ఈ లోపు టెండర్ల ప్రక్రియను పూర్తి చేస్తామని.. మూడేళ్లలో మెట్రో నిర్మిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.


సాగరతీరం విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతోంది. పలు ఐటీ కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయి. అలాగే నగర జనాభా పెరుగుతున్న నేపథ్యంలో.. విశాఖలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిని పరిష్కరించేందుకు ప్రభుత్వం.. సెమీ రింగ్ రోడ్డు ఆలోచన చేస్తోంది.


హైదరాబాద్, అమరావతి తరహాలో నగరం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మించాలంటే విశాఖపట్నం భౌగోళిక పరిస్థితులు అనుకూలించవు. ఎందుకంటే విశాఖకు ఓ వైపు సముద్రం, మూడు వైపులా కొండలు ఉన్నాయి. దీంతో పూర్తి రింగ్‌ రోడ్డు నిర్మించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో సెమీ రింగ్ రోడ్డు ఆలోచన చేస్తున్నారు. ఇందుకోసం విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) అధ్యయనం జరుపుతోంది.


విశాఖపట్నం, అనకాపల్లితో కలవకుండా వాటి పైనుంచి విజయనగరం మీదుగా భోగాపురం వరకూ సెమీ రింగ్ రోడ్డు నిర్మించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. మొత్తం 85 కిలోమీటర్ల మేరకు ఆరు వరుసలుగా దీనిని నిర్మించాలని వీఎంఆర్డీఏ భావిస్తోంది. అనకాపల్లి, పెందుర్తి, ఆనందపురం మీదుగా భోగాపురం విమానాశ్రయం వరకూ ఈ సెమీ రింగ్ రోడ్డు నిర్మించే ఆలోచనలో ఉన్నారు.


విశాఖ సెమీ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌‌, రింగ్‌ రోడ్డు పొడవు, వెడల్పు వంటి అంశాలతో పాటుగా సెమీ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఎంతమేరకు భూములు అవసరమవుతాయి.. వంతెనలు ఎక్కడ ఏర్పాటుచేయాల్సి వస్తుందనే దానిపై అధ్యయనం చేసేందుకు వీఎంఆర్‌డీఏ కన్సల్టెంట్లను కూడా ఆహ్వానించింది.

Latest News
Pakistan's Karachi reports its first case of mpox this year Tue, Mar 31, 2026, 05:01 PM
Impromptu visit: Delhi LG TS Sandhu promises early fix to Kamla Nagar Market woes Tue, Mar 31, 2026, 04:59 PM
India's bioeconomy nears $200 billion, innovation push signals next growth phase Tue, Mar 31, 2026, 04:55 PM
Pakistan: Two passengers offloaded from plane for using umrah visa to enter Europe Tue, Mar 31, 2026, 04:53 PM
SRFI to host World Squash Officiating Refereeing Course in Chennai Tue, Mar 31, 2026, 04:52 PM