|
|
by Suryaa Desk | Sat, Mar 21, 2026, 10:33 AM
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారమే కొండపైకి చేరుకున్న సీఎం, ఇవాళ ఉదయం వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముందుగా సీఎం కుటుంబ సభ్యులకు టీటీడీ ఈవో రవిచంద్ర, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులు, అర్చకులు ఆలయ మహా ద్వారం వద్ద సీఎం చంద్రబాబుకు సిబ్బంది పూర్ణ కుంభం, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ ఆలయ మర్యాదలతో ఆయనను లోపలికి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు మంత్రి నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఏటా దేవాన్ష్ పుట్టిన రోజున చంద్రబాబు కుటుంబం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని, అన్నదానానికి రూ.44 లక్షలు విరాళం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ముఖ్యమంత్రి కుటుంబానికి వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తిరుమలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.శ్రీవారి దర్శనం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన కాంప్లెక్స్లో సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం అన్న ప్రసాద వితరణ చేయనున్నారు.ఒక్కరోజు అన్నదానానికి వ్యయం అయ్యే రూ.44 లక్షల విరాళాన్ని ఇప్పటికే సీఎం చంద్రబాబు కుటుంబం అందజేశారు. ఇప్పటికీ 12 మార్లు అన్నదానానికి ఎస్వీ అన్నదాన ట్రస్ట్కు సీఎం చంద్రబాబు నాయుడు విరాళం ఇచ్చారు.