|
|
by Suryaa Desk | Fri, Mar 27, 2026, 10:43 PM
ఈపీఎఫ్ ఖాతాదారులకు పెద్ద ఊరటగా ఉంది. ఈపీఎఫ్వో 3.0 లో భాగంగా నగదు విత్డ్రా ప్రక్రియను మరింత వేగవంతం చేయనుంది. త్వరలో, ఖాతాదారులు ఏటీఎం ద్వారా కూడా సొమ్మును సులభంగా ఉపసంహరించుకునే అవకాశం పొందబోతున్నారు.ఈ సౌకర్యం ప్రారంభమయ్యాక, పీఎఫ్ సొమ్మును ఎక్కడి ఏటీఎం నుండి అయినా సెకన్లలో తీసుకోవచ్చు. ఇప్పటివరకు, పీఎఫ్ డబ్బులను తీసుకోవాలంటే క్లిష్టమైన ప్రక్రియలతో ఎదుర్కోవలసి ఉండేది, దీనికి 2–3 రోజుల సమయం పడేది. ఖాతాదారులు పీఎఫ్ పోర్టల్లోకి వెళ్లి క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. కొత్త సౌకర్యం వచ్చాక, మీరు సమీప ఏటీఎం నుండి ఎప్పుడైనా డబ్బులు ఉపసంహరించుకోవచ్చు.
*పీఎఫ్ ఏటీఎం ఎలా పనిచేస్తుంది:ఈపీఎఫ్వో ఖాతాదారులకు ప్రత్యేక ఏటీఎం కార్డులు జారీ చేస్తుంది, ఇవి డెబిట్ కార్డులా ఉపయోగించవచ్చు. మీ పీఎఫ్ బ్యాలెన్స్లో 25% మినహా మిగతా 75% సొమ్మును ఏటీఎం ద్వారా ఉపసంహరించవచ్చు. ఏ బ్యాంక్ ఏటీఎం అయినా ఉపయోగించుకోవచ్చు. ఏటీఎం ద్వారా ఒకేసారి రూ.2 లక్షల వరకు విత్డ్రా చేయవచ్చు. మూడు సంవత్సరాల సర్వీస్ తర్వాత రూ.2 లక్షలు విత్డ్రా చేస్తే 10% TDS కట్టాల్సి ఉంటుంది. ఐదు సంవత్సరాల సర్వీస్ తర్వాత తీసుకుంటే ఎలాంటి పన్ను ఉండదు.
*పరిమితులు:అత్యవసర అవసరాల కోసం,వైద్య ఖర్చులు, ఇంటి ఖర్చులు, ఉద్యోగం కోల్పోవడం, పీఎఫ్ మొత్తం 75% విత్డ్రా చేయవచ్చు. మిగతా 25% డబ్బులు ఉద్యోగం మానేశాక మాత్రమే తీసుకోవచ్చు. ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి అయితే, పీఎఫ్ విత్డ్రా పన్ను రహితంగా ఉంటుంది. ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి కాకపోతే పన్ను విధిస్తారు.తదుపరి దశలో, యూపీఐ ద్వారా కూడా పీఎఫ్ విత్డ్రా సౌకర్యం అందించనున్నారు. ఇది ఏప్రిల్ నుండి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బీమ్ యాప్లో మొదలు పెట్టబడుతుంది. తరువాత, ఫోన్పే, పేటీఎం, గూగుల్ పే వంటి ఇతర యాప్లలో కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.