|
|
by Suryaa Desk | Wed, Apr 15, 2026, 10:04 PM
ఇరాన్–అమెరికా మధ్య మళ్లీ చర్చలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయా? త్వరలోనే రెండు దేశాలు తిరిగి చర్చల టేబుల్ వద్దకు వస్తాయా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇరాన్లో ప్రత్యక్షం కావడం కీలకంగా మారింది.గత శనివారం ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్–అమెరికా మధ్య శాంతి ఒప్పందంపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. దాదాపు 21 గంటల పాటు సాగిన ఈ సమావేశాలు చివరికి ఫలితం లేకుండా ముగిశాయి. ఈ చర్చలకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించిన విషయం తెలిసిందే. చర్చలు విఫలమవడంతో సంబంధిత పక్షాలు తమ తమ మార్గాల్లో వెనుదిరిగాయి.ఈ నేపథ్యంలో తాజాగా అసిమ్ మునీర్ ఇరాన్లో కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాషింగ్టన్ నుంచి వచ్చిన తాజా సందేశాన్ని ఇరాన్ ఉన్నతాధికారులకు చేరవేయడానికే ఆయన టెహ్రాన్కు వెళ్లినట్లు సమాచారం. అమెరికా నుంచి వచ్చిన కొత్త ప్రతిపాదనలు లేదా సందేశాన్ని మధ్యవర్తిగా ఆయన ఇరాన్కు వివరించినట్లు వార్తలు వస్తున్నాయి.ఇరాన్ ఆమోదం తెలిపితే త్వరలోనే ఇరాన్–అమెరికా మధ్య మళ్లీ చర్చలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈసారి కూడా ఇస్లామాబాద్ వేదికగా సమావేశాలు జరగవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం, అమెరికా నుంచి వచ్చిన తాజా సందేశాన్ని పాకిస్థాన్ ద్వారా అందుకున్నామని, దాని ఆధారంగా చర్చలను తిరిగి ప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.
Latest News