|
|
by Suryaa Desk | Tue, Apr 28, 2026, 09:19 PM
నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోనలో వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ ఆలయ అర్చకులు సకల దేవతలను ఆహ్వానించారు. వేదమంత్రోచ్చారణలతో ఆలయ ప్రాంగణం ముక్తకంఠంగా మారింది.శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గరుత్మంతుడి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయంలో క్షేత్రోత్సవాన్ని కూడా ఆచరించారు.తెల్లని వస్త్రంపై పసుపు, గంధం, చందనం, కుంకుమతో ప్రత్యేకంగా రూపొందించిన గరుత్మంతుడి ప్రతిమను వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ధ్వజస్థంభంపై ఎగురవేశారు. దీంతో సకల దేవతలకు ఆహ్వానం పలికినట్లైంది.ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన తిరుచ్చిపై కొలువుదీర్చి ఆలయ ప్రాంగణంలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉండటంతో భక్తులు భారీగా తరలివచ్చారు.గరుత్మంతుడికి నిర్వహించిన పూజలు, అభిషేకాలకు ఉపయోగించిన ప్రసాదాలను స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం ఉండటంతో మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. కొడిముద్దల కోసం పోటీపడి ప్రసాదాన్ని స్వీకరించడం విశేషంగా నిలిచింది.
Latest News