|
|
by Suryaa Desk | Tue, Apr 28, 2026, 10:00 PM
ఇంట్లో ఎల్పీజీ గ్యాస్ వాడే వినియోగదారులకు మరోసారి ధరల షాక్ తగలబోతోందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వంట గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, అలాగే హార్మూజ్ జలసంధి ద్వారా సరుకు రవాణా అంతరాయం కలగడం వంటి పరిణామాలను విశ్లేషకులు చెబుతున్నారు.గల్ఫ్ దేశాల్లో కూడా ప్రస్తుతం సాధారణ పరిస్థితులు లేకపోవడంతో ఎల్పీజీ ధరలపై ఒత్తిడి పెరుగుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మే 1 నుంచి వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరగవచ్చని మార్కెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాధారణంగా ప్రతి నెలా 1వ తేదీన ఆయిల్ కంపెనీలు కొత్త ధరలను ప్రకటిస్తాయి. మరో రెండు రోజుల్లో కొత్త నెల ప్రారంభం కానుండటంతో గ్యాస్ ధరలపై ఉత్కంఠ నెలకొంది.ఇప్పటికే 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.60 మేర పెంచినట్లు కంపెనీలు తెలిపాయి. అలాగే వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలు ఇటీవల రూ.218 వరకు పెరిగాయి. మార్చి 7న ధరలు పెరిగిన తర్వాత ఏప్రిల్ 1న కూడా కమర్షియల్ సిలిండర్ రేట్లలో మార్పులు చోటుచేసుకున్నాయి.ప్రస్తుతం హార్మూజ్ జలసంధి ద్వారా సరుకు రవాణా పరిస్థితులు మెరుగుపడకపోవడంతో మే 1న గ్యాస్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి.ఇక గ్యాస్ సరఫరా వ్యవస్థలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. గ్యాస్ డెలివరీ సమయంలో ఓటీపీ తప్పనిసరి చేయబడింది. గ్యాస్ బుకింగ్ చేసిన వినియోగదారుడికి వచ్చే ఓటీపీని డెలివరీ సమయంలో నమోదు చేసిన తర్వాతే సిలిండర్ అందజేస్తున్నారు. దీని ద్వారా నిజమైన వినియోగదారుడికే గ్యాస్ చేరేలా చర్యలు తీసుకుంటున్నారు.అలాగే ఎల్పీజీ వినియోగదారులు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేయాలి. ఆధార్తో లింక్ చేసిన మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా ఆన్లైన్లో లేదా గ్యాస్ ఏజెన్సీ వద్ద కేవైసీ పూర్తి చేయవచ్చు. డెలివరీ బాయ్ వద్ద ఉన్న బయోమెట్రిక్ పరికరాల ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది. కేవైసీ పూర్తి చేయకపోతే సబ్సిడీలు నిలిచిపోవడంతో పాటు గ్యాస్ బుకింగ్, డెలివరీలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Latest News