|
|
by Suryaa Desk | Fri, May 01, 2026, 10:38 PM
ఇప్పటికే ఎల్పీజీ ధరల భారీ పెంపుతో వినియోగదారులకు షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, త్వరలో మరోసారి ధరల పెంపు దిశగా అడుగులు వేస్తోందని సమాచారం. ఈసారి పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి.పెట్రోల్, డీజిల్తో పాటు గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరలు కూడా పెరగవచ్చని అంచనా. అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా, విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ పెంపు దాదాపు ఖాయమని చెబుతున్నారు.తాజా అంచనాల ప్రకారం పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ.4–5 వరకు, అలాగే గృహ ఎల్పీజీ సిలిండర్పై రూ.40–50 వరకు పెంపు ఉండవచ్చని తెలుస్తోంది. 2022 తర్వాత ఒకేసారి ఇంత పెద్ద స్థాయిలో ఇంధన ధరలు పెరగడం ఇదే మొదటిసారి కావచ్చని విశ్లేషకులు అంటున్నారు.ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి. రవాణా మార్గాల్లో అంతరాయాలు, సరఫరా తగ్గుదల వంటి కారణాలతో గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. దీని ప్రభావం దేశీయ ఇంధన ధరలపై పడుతోందని అధికారులు చెబుతున్నారు.చమురు మార్కెటింగ్ కంపెనీలపై (Oil Marketing Companies) పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి కారణంగా ధరల సవరణ తప్పనిసరి అవుతుందని ప్రభుత్వం వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ధరలు పెంచకపోతే కంపెనీలు భారీ నష్టాలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని చెబుతున్నారు.ఇటీవల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను కూడా భారీగా పెంచిన విషయం తెలిసిందే. అదే సమయంలో, ఎన్నికల కారణంగా తాత్కాలికంగా ధరల పెంపును వాయిదా వేశారని సమాచారం.సబ్సిడీ పెంపు లేదా పన్నుల సవరణ వంటి మార్గాల ద్వారా కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉన్నప్పటికీ, మొత్తం మీద ధరల పెంపు ప్రభావం వినియోగదారులపై పడే అవకాశం ఉంది.ఈ అంశంపై వచ్చే 5–7 రోజుల్లో కేంద్రం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ధరలు పెరిగితే సాధారణ ప్రజలతో పాటు వ్యాపార రంగం, రవాణా ఖర్చులపై కూడా గణనీయమైన భారం పడనుంది.
Latest News