తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఓవైపు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుంటే.. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలోని నేతలు ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగులు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. తాజాగా భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో స్పందించారు.
కాంగ్రెస్ పార్టీది పూర్తిగా ద్వంద్వ నీతి అని.. కేటీఆర్ విమర్శించారు. తాజాగా విడుదల చేసిన జాతీయ మేనిఫెస్టోలో రాజ్యాంగ పరిరక్షణ అనే చాప్టర్లోని 13వ పాయింట్ గురించి కేటీఆర్ ప్రస్తావించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి వెళితే వెంటనే అనర్హతకు గురయ్యేలా చట్ట సవరణ చేస్తామని చెబుతున్న కాంగ్రెస్.. తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి ఏకంగా ఎంపీ టికెట్ కేటాయించిందంటూ దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి మరీ కాంగ్రెస్లో చేర్పించుకుంటోందని కేసీఆర్ విమర్శించారు. గెలిచే అంత వరకు ఒక మాట... గెలిచాక ఇంకో మాట.. ఇదే కాంగ్రెస్ రీతి.. నీతి అంటూ దుమ్మెత్తిపోశారు. బీజేపకి కాంగ్రెస్కి తేడా ఏంటో అని ప్రశ్నించారు. మేనిఫెస్టోల్లో చెప్పిన అంశాలు అమలు చేసే ఉద్దేశం లేనపుడు ఎందుకీ నాటకాలు రాహుల్ గాంధీ అంటూ సూటి ప్రశ్నలు సంధించారు కేటీఆర్.
ఈ ట్వీట్కు తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరిన ఫొటోను కూడా కేటీఆర్ జత చేశారు. అయితే.. తెల్లం వెంకట్రావు ఇప్పటికే పలు కాంగ్రెస్ సభల్లో పాల్గొనగా.. ఆయన పార్టీలో చేరటం ఖాయమేనని వార్తలు ప్రచారమయ్యాయి. కాగా.. దానిపై ఏమాత్రం స్పందించిన తెల్లం.. డైరెక్టుగా కండువా కప్పుకుని బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa