పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. బతికున్నప్పుడు విలువ ఇవ్వకున్నా పర్లేదు కానీ.. చావుకైనా విలువ ఇవ్వాలంటూ ఓ తెలుగు సినిమాలో డైలాగ్. కానీ.. ఇక్కడ మాత్రం ఓ మహిళ.. తన భర్తతో ఉన్న గొడవల కారణంగా.. ఆయన చనిపోయిన తర్వాత కూడా మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా అడ్డుకుంది. బంధువులు ఎంత చెప్పినా వినకుండా.. రెండు రోజుల పాటు గోదావరి నది ఒడ్డునే మృతదేహాం ఉండేలా చేసింది. ఇంతా చేసి.. చివరికి తన కుమారిడితో కనీసం తండ్రికి తలకొరివి కూడా పెట్టనీయకుండా తీసుకెళ్లిపోయింది. ఇదంతా చేసింది.. తన భర్త ఆస్తిలో వాటా కోసం కావటం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పెద్దపెల్లి జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన సునీల్ అనే వ్యక్తి.. గత కొంతకాలంగా హైదరాబాద్లో ఉంటున్నాడు. హైదరాబాద్కు చెందిన సంధ్య అనే యువతితో సునీల్కు 2020లో వివాహం జరగ్గా.. 2021లో ఒక కుమారుడు కూడా జన్మించాడు. గత సంవత్సర కాలంగా.. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో దంపతులిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. దీంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన సునీల్ మద్యానికి బానిసై పోయాడు.
ఈ క్రమంలోనే.. తీవ్ర అనారోగ్యానికి గురైన సునీల్.. మూడు రోజుల క్రితం హైదరాబాద్లోనే మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న సునీల్ తల్లి, సోదరుడు వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్కు వెళ్లి.. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం.. మృతదేహాన్ని సొంతూరికి తీసుకెళ్లారు. అంత్యక్రియల కోసం మంథని గోదావరి నది వద్దకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే.. మృతుని భార్య సంధ్య మంథనికి వచ్చి అంత్యక్రియలు కాకుండా అడ్డుకుంది.
తనకు ఒక కుమారుడు ఉన్నాడని.. తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలని సంధ్య డిమాండ్ చేసింది. దహన సంస్కారాలు కాకుండా అడ్డుకోవడంతో.. స్థానికులు, అధికారులు ఎంత నచ్చజెప్పినా.. సంధ్య విన్లేదు. దీంతో.. రెండు రోజుల పాటు గోదావరి నది ఒడ్డునే సునీల్ మృతదేహంతో వారి కుటుంబ సభ్యులు దహన సంస్కారాల కోసం వేచి చూశారు. చివరకు సోమవారం (సెప్టెంబర్ 09) రోజున ఉదయం గ్రామానికి చెందిన పెద్దమనుషులు నచ్చ చెప్పడంతో.. అంత్యక్రియలు అయ్యేంతవరకు కూడా ఆగకుండా సంధ్య తన కుమారున్ని తీసుకొని తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయింది.
కుమారుడితో తండ్రికి కనీసం దహన సంస్కారాలు కూడా చేయించకుండా.. ఆస్తిలో వాటా కోసం 2 రోజుల పాటు మృతదేహానికి అంత్యక్రియలు కాకుండా అడ్డుకుందని సంధ్యపై బంధువులు, స్థానికులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మానవత్వం మంట కలిసిపోతుందనేందుకు ఈ ఘటనే నిదర్శనమని తెలిపారు. బంధాలు, బంధుత్వాల కంటే.. డబ్బులకే విలువ ఎక్కువైపోయిందంటూ వాపోతున్నారు. ఈ సంఘటనపై గ్రామస్తులు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa