ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెట్రో విస్తరణ.. ఈ ఐదు మార్గాల్లోనే, డీపీఆర్‌లు సిద్ధం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 14, 2024, 07:31 PM

హైదరాబాద్ మెట్రో సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ప్రతిరోజూ 4 నుంచి 5 లక్షల మందిని తమ గమ్యస్థానాలకు చేరవేస్తోంది. నగరం ఓ మూల నుంచి మరో మూలకు వెళ్లేవారు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా హాయిగా ఏసీలో కూర్చొని తక్కువ టైంలోనే ట్రావెల్ చేస్తూన్నారు. మెట్రో 2017లో అందుటాబులోకి రాగా.. తొలి దశలో మూడు కారిడార్లలో సేవలందిస్తోంది. ఎల్బీనగర్- మియాపూర్, నాగోల్- రాయదుర్గం, జేబీఎస్- ఎంజీబీఎస్ మధ్య రాకపోకలు సాగిస్తోంది.


మెట్రో రెండో దశను కూడా ప్రతిపాదించారు. మెట్రో ట్రైన్ సెకండ్ ఫేజ్‌కు సంబంధించిన డీపీఆర్‌లు దాదాపుగా సిద్ధం అయినట్లు సమాచారం. మెుత్తం 5 మార్గాల్లో కలిపి 78.6 కి.మీ.గా రెండో దశను ప్రతిపాదించారు. ఈ రెండో ఫేజ్‌లో దాదాపుగా 60కి పైగా స్టేషన్లు రానున్నాయి. అందుకు రూ.24,042 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కొత్త మార్గాలపై సీఎం రేవంత్ ఇప్పటికే పలుమార్లు అధికారులకు కీలక సూచనలు చేశారు. సీఎం సూచనల మేరకు రెండోదశ డీపీఆర్‌లు వేర్వేరుగా తయారు చేస్తున్నారు. ఈ నెల చివరి నాటికి ఆయా డీపీఆర్‌లను అధఇకారులు ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. అనంతరం కేబినెట్ ఆమోదం తర్వాత.. కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపిస్తారు.


మెట్రో రెండోదశలో ప్రతిపాదించిన అన్ని మార్గాలు కూడా మొదటి దశలోని మూడు కారిడార్లకు కొనసాగింపుగా ఉన్నాయి. కారిడార్‌-1కి కొనసాగింపుగా ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ మెట్రో నిర్మించనున్నారు. మెుత్తం 8 కి.మీ. మేర ఈ మార్గాన్ని పొడిగించనున్నారు. ఇదే కారిడార్‌లో రెండోవైపు పొడిగింపుగా మియాపూర్‌ నుంచి పటాన్‌చెరు మెట్రోను విస్తరిస్తారు. మెుత్తం14 కి.మీ. మేర పొడిగిస్తారు. చందానగర్‌ ప్రాంతంలో కొంతదూరం డబుల్‌డెక్‌ని మెట్రో అధికారులు ప్రతిపాదించారు. ఇందులో మెుత్తం 10 స్టేషన్లు వస్తాయి.


మెట్రో కారిడార్‌-2కు కొనసాగింపుగా.. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట వరకు మెట్రో నిర్మించనున్నారు. మెుత్తం 7.5 కి.మీ. ఆరు స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. కారిడార్‌-3కి కొనసాగింపుగా.. రాయదుర్గం నుంచి కాజాగూడ, నానక్‌రాంగూడ, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్, యూఎస్‌ కాన్సులేట్‌, కోకాపేట నియోపోలీసు వరకు మెట్రో పొడగించారు. మెుత్తం 11.3 కి.మీ. వరకు ట్రైన్ సర్వీసులు విస్తరించనున్నారు. ఇదే కారిడార్‌లో మరో వైపు నాగోల్‌ నుంచి ఎల్బీనగర్, మైలార్‌దేవుపల్లి, జల్‌పల్లి, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు 33.1 కి.మీ పొడిగించనున్నారు. ఇక్కడ మెుత్తం 22 స్టేషన్లను కొత్తగా ప్రతిపాదించారు.


ఈ కారిడార్‌నే మైలార్‌దేవ్‌పల్లినుంచి ఆరాంఘర్- రాజేంద్రనగర్‌ వ్యవసాయ వర్సిటీ సమీపంలో నిర్మించే కొత్త హైకోర్టు వరకు పొడిగించేందుకు ప్రతిపాదించారు. దాదాపు 5 కి.మీ. ఈ మార్గంలో కొత్తగా మూడు స్టేషన్లు రానున్నాయి. కొత్తగా ఫ్యూచర్ సిటీకి కూడా మెట్రో ట్రైన్ విస్తరించాల్సి ఉండగా.. అందుకు సంబంధించిన రూట్లు ఇంకా ఖరారు కాలేదు. అయితే ప్రస్తుతానికి ఈ డీపీఆర్‌లను కేంద్రం ఆమోదానికి పంపించనున్నారు. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే తర్వలోనే పనులు ప్రారంభం కానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa