'శభాష్ తెలంగాణ బిడ్డ!' అంటూ మహిళా క్రికెటర్ గొంగడి త్రిషపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. అండర్-19 మహిళల ప్రపంచకప్లో త్రిష రాణిస్తుండటంతో ఆయన అభినందించారు. మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా జరిగిన అండర్-19 మహిళల వరల్డ్ కప్లో స్కాట్లాండ్ జట్టుపై భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈరోజు మ్యాచ్లో త్రిష టోర్నీ చరిత్రలోనే తొలి సెంచరీతో పాటు ఆల్ రౌండర్ ప్రదర్శన కనబరిచింది.ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 'శభాష్ తెలంగాణ బిడ్డ! మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే మొట్టమొదటి సెంచరీ సాధించిన క్రీడాకారిణిగా నిలిచి, ప్రపంచ వేదికపై మన దేశ సత్తా చాటిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషకు నా హృదయపూర్వక అభినందనలు' అని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలానికి చెందిన త్రిష భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం మనందరికీ గర్వకారణమని, మున్ముందు కూడా మరింతగా రాణించి తెలంగాణ క్రీడాకారులకు ఆదర్శప్రాయంగా నిలవాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.త్రిష లాంటి మరింతమంది మెరికల్లాంటి క్రీడాకారులను తయారు చేసేందుకు మన ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని, అద్భుత నైపుణ్యం ప్రదర్శించిన క్రీడాకారులకు తగిన గుర్తింపునిస్తూనే, మరింతమంది తెలంగాణ బిడ్డలు ప్రపంచ స్థాయిలో రాణించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూవర్సిటీ ఏర్పాటుకు సంకల్పించామని తెలిపారు.క్రీడల ప్రోత్సాహానికి మన ప్రజా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని, త్రిష లాంటి క్రీడాకారిణిల స్ఫూర్తితో మన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా రాణించాలని పిలుపునిస్తున్నానంటూ సీఎం రాసుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa