జహీరాబాద్ నియోజకవర్గ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటరిచ్చారు. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫామ్ హౌస్లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు, కాంగ్రెస్ పార్టీ మీద చేసిన విమర్శలకు రేవంత్ రెడ్డి కౌంటరిచ్చారు. ఫామ్ హౌస్లో ఉంటూ మాట్లాడటం కాదని.. చిత్తశుద్ధి ఉంటే, అసెంబ్లీకి రావాలని ఛాలెంజ్ చేశారు. రైతుభరోసా ఎగ్గొడతామని కేసీఆర్ అంటున్నారని.. ఆయనలాగా తాము మాటతప్పే రకం కాదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
"తెలంగాణ ధనిక రాష్ట్రమంటూ కేసీఆర్ అబద్ధాలు చెప్పారు. వచ్చి చూస్తే ఖాళీ తప్ప ఏమీ లేదు. అయినా అధైర్యపడకుండా కేసీఆర్ ఎగొట్టిన రైతుభరోసా ఇస్తున్నాం. ఏడాదికి రూ.12000 రైతుభరోసా ఇవ్వాలని జనవరి 26న ప్రారంభించాం. మార్చి 31వ తేదీలోపు మీ అకౌంట్లలోకి వేసే పూచీ నాది. రైతుభరోసా ఎగ్గొడతామని కేసీఆర్ అంటున్నారు. నేను మీలాగా ఎగ్గొట్టే రకం కాదు. దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అంటూ ఎగ్గొట్టారు. పదేళ్లు పరిపాలన చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు పోయాయ్. అబద్ధాలు చెప్తే పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు ఇచ్చారు." అంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.
"14 నెలల నుంచి ఫామ్ హౌస్లో గంభీరంగా చూస్తూ ఉన్నారంట. ఏం చూస్తున్నారు.. కేటీఆర్, హరీష్రావులను ఊరి మీదకు వదిలావ్. దర్గాకు వదిలిన మేకపోతుల్లాగా మేస్తా ఉన్నారిద్దరూ. పాలమూరు ప్రాజెక్టు కడతానని చెప్పి మాట తప్పావ్. జహంగీర్ పీర్ దర్గాకు, వేములవాడ రాజన్న ఆలయానికి రూ.100 కోట్లు ఇస్తానని మాట తప్పారు. తెలంగాణ ప్రజలు ఆయన కోసం ఎదురుచూస్తున్నారంట.. కేసీఆర్ గారూ.. తెలంగాణ ప్రజలు ఎవరూ మీ కోసం ఎదురు చూడటం లేదు. బాధపడటం లేదు. రైతులకు భరోసా, విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఫ్రీ సిలిండర్లు ఇస్తున్నాం. తెలంగాణ ప్రజలు ఎవరూ బాధపడటం లేదు. " అని కౌంటర్ ఇచ్చారు.
ఇక తాను కొడితే బలంగా కొడతానన్న కేసీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ కౌంటరిచ్చారు. " ఆయన కొడితే బలంగా కొడతాడంట. కర్ర లేకుండా సరిగ్గా నిలబడేది నేర్చుకోవాలి ముందు. నువ్వు తూలుతున్నావా.. తూగుతున్నావా.. నిలబడగలివే పరిస్థితుల్లో ఉన్నావా అనేది చూస్కోవాలి. సోషల్ మీడియాలో నాకు, కేసీఆర్కు పోటీపెడితే.. ఆయనకు లైకులు ఎక్కువచ్చాయంట. బాలీవుడ్లో కూడా సల్మాన్ ఖాన్కు, రాఖీసావంత్కు పోటీపెడితే.. రాఖీసావంత్కే ఎక్కువ లైకులు వచ్చాయి. అంతమాత్రాన రాఖీసావంత్, సల్మాన్ ఖాన్ కంటే గొప్ప అవుతారా? పదేళ్ల పాలనను జనం తిరస్కరిస్తే, ఫామ్హౌస్లో ఉంటూ సోషల్ మీడియా లైకులు గురించి మాట్లాడుతున్నారు. కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రావాలి. ఏబీసీడీ వర్గీకరణపై మాట్లాడదాం.. నువ్వా, మేమా తేల్చుకుందాం.. కేసీఆర్ కాలం చెల్లిపోయిన వెయ్యి రూపాయల నోటు. ఆ నోటుకు ఇప్పుడు విలువ లేదు. ఆ నోటు ఉంటే జైళ్లో వేస్తారు. తెలంగాణ సమాజంలో కేసీఆర్ గురించి అడిగేవారు లేరు" అంటూ కేసీఆర్కు రేవంత్ రెడ్డి కౌంటరిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa