ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అర్చకులు రంగరాజన్‌ మీద దాడిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 10, 2025, 07:26 PM

చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్ మీద జరిగిన దాడిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రంగరాజన్ మీద కొందరు దుండగులు దాడికి పాల్పడిన ఘటన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. సోమవారం (ఫిబ్రవరి 10న) రోజు సాయంత్రం రంగరాజన్‌కు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని.. కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఇలాంటి దాడులను సహించేది లేదని.. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే.. పాదయాత్ర సమయంలో చిలుకూరు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకున్నట్టు గుర్తుచేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. వీలు చూసుకుని త్వరలోనే ఆలయానికి వస్తానని తెలిపారు.


అంతకుముందు.. ఈ దాడి ఘటనపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా స్పందిస్తూ.. తీవ్రంగా ఖండించారు. రామరాజ్యం పేరుతో దాడులు చేసే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి హెచ్చరించారు. ప్రముఖ పుణ్యక్షేత్ర ప్రధాన అర్చకుడిపై దాడి చేయటం.. హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామరాజ్యం పేరుతో రౌడీయిజం చేస్తూ అరాచకాలకు పాల్పడుతున్న వారిని ఉపేక్షించేది లేదు అని మంత్రి వార్నింగ్ ఇచ్చారు. రాముడి పేరును బద్నాం చేస్తూ.. అరాచక, అనాగరిక కార్యక్రమాలకు పాల్పడటం దుర్మార్గమన్నారు. ఇది క్షమించరాని నేరమన్నారు. రాముడి భక్తుల మనోభావాలను దెబ్బ తీసే చర్యగా పేర్కొన్నారు. మ


ఇదిలా ఉంటే.. రంగరాజన్‌పై దాడి కేసులో.. ఇప్పటికే ప్రధాన నిందితునిగా భావిస్తున్న వీర రాఘవ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా.. వీర రాఘవ రెడ్డి అనుచరుల్లో ఏడుగురిని వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం 20 మందికిపైగా దాడికి పాల్పడగా.. మిగతా నిందితుల కోసం రాష్ట్రమంతా గాలిస్తున్నామని మొయినాబాద్ పోలీసులు తెలిపారు.


మరోవైపు.. రంగరాజన్‌ మీద జరిగిన దాడిపై ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ ప్రముఖులు స్పందించారు. కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు స్వయంగా వెళ్లి రంగరాజన్‌ను పరామర్శించారు. దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏమాత్రం భయపడొద్దని.. తాము అండగా ఉన్నామని ధైర్యం చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa