ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన వల్లే ఓడిపోయాం.. సీఎం రేవంత్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 10, 2025, 10:14 PM

తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ నామినేషన్ వేసిన సమయంలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. కేటీఆర్ చేసిన కామెంట్లపై.. సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సోమవారం సీఎల్పీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. కీలక విషయాలు ప్రస్తావించారు. క్రిమినల్స్ ఎప్పుడూ కేసులకు భయపడరని.. కేసులకు భయపడితే అసలు నేరాలే చేయరని చెప్పుకొచ్చారు. అసలు కేటీఆర్ గురించి మాట్లాడటమే వేస్ట్ అంటూ రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు.


మరోవైపు.. ఇటీవల తెలంగాణలో జరిగిన రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తన సిట్టింగ్ స్థానమైన కరీనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటును కోల్పోవడంపై స్పందించిన రేవంత్ రెడ్డి.. హరీష్ రావు వల్లే ఓడిపోయామంటూ చెప్పుకొచ్చారు. హరీష్ రావు పూర్తిగా బీజేపీకి లొంగిపోయారని సీఎం రేవంత్ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దగ్గరుండి మరీ బీజేపీకి ఓట్లు వేయించారని కీలక ఆరోపణలు చేశారు. అందుకే కాంగ్రెస్ ఓడిపోయిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.


బీఆర్ఎస్ వాళ్లతో సంబంధం ఉండటం వల్లే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన అన్ని పార్టీల ఎంపీల సమావేశానికి బీజేపీ రాలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీసీ కులగణనతో సామాజిక న్యాయం జరిగిందని.. తాము చేసిన కుల గణన వల్లే ఇవాళ అన్నీ పార్టీలు బీసీలకు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చాయని రేవంత్ చెప్పుకొచ్చారు.


మరోవైపు.. రాష్ట్రంలో రైతులు బాధ పడుతున్నారని తెలియగానే.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు.. ముగ్గురు కలిసి తీన్మార్ డాన్సులు వేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీని పడావ్ పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని ఆరోపించారు. రాష్ట్రంలో కరువు వచ్చిందని జనాలను ఆందోళనకు గురిచేస్తున్నారని.. పండిన పంట నివేదిక చూసి మాట్లాడాలని సూచించారు. గతంలో రెండో పంట 35 లక్షల ఎకరాలు వేశారని.. కానీ ఇప్పుడు మొదటి సారి రాష్ట్రంలో 55 లక్షల ఎకరాలలో రైతులు పంటలు వేశారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


కేసీఆర్ చెల్లని రూపాయి అని ఆయన గురించి మాట్లాడటం సమయం వృథా అని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ స్థాయికి కాంగ్రెస్‌లో ఎవరూ సరిపోరని.. వాళ్ల పిచ్చి మాటలు, పనికిమాలిన దూషణలు, కారుకూతలు వినడానికి కేసీఆర్‌ రావద్దనేది కొడుకుగా తన అభిప్రాయమంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్‌ను బండకేసి కొట్టి ఓడించింది తానేనని తెలిపిన రేవంత్ రెడ్డి.. తండ్రి కొడుకులకు బలుపు తప్ప ఏమీ లేదని దుయ్యబట్టారు. డ్రగ్స్ పార్టీల్లో దొరకడం కేటీఆర్ స్టెచరా అని ప్రశ్నించారు. కేటీఆర్ అన్నట్లు నిజంగానే అసెంబ్లీకి వచ్చే స్థాయి కేసీఆర్‌కు లేదని చెప్పుకొచ్చారు. కేటీఆర్ ఓ పిచ్చోడని.. ఏదేదో మాట్లాడతాడంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa