తెలంగాణలో మరోసారి భూమి కంపించింది. సోమవారం (మే 05న) రోజున ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్వల్పంగా భూమి కంపించింది. భూప్రకంపనలు వచ్చిన ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ముఖ్యంగా.. కరీంనగర్ జిల్లాలోని గంగాధర, చొప్పదండి, రామడుగు, కమ్మర్పల్లి, మోర్తాడ్ తదితర మండలాల్లో భూమి 2 సెకన్ల పాటు కంపించింది. మొదట ఉరుములు అనుకున్నప్పటికీ, భూమి కదలడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు.
అలాగే.. జగిత్యాల జిల్లా కేంద్రంలో కూడా భూమి ఒక్కసారిగా కంపించింది. సుమారు 3 సెకన్ల పాటు భూమి కుదుపులకు లోనవడంతో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జగిత్యాల పట్టణంతో పాటు కోడిమ్యాల, మాల్యాల, రాయికల్ పరిసర గ్రామాల్లో కూడా భూమి కంపించినట్లు సమాచారం అందింది.
మరోవైపు.. నిర్మల్ జిల్లాలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. కడెం, జన్నారం, ఖానాపూర్, లక్ష్మణ్చాందా మండలాల్లో 2 నుంచి 5 సెకన్లపాటు భూమి కంపించింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 3.8గా నమోదైంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల్లోనూ స్వల్పంగా భూమి కంపించినట్లు సమాచారం అందుతోంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో సంభవించిన ఈ స్వల్ప భూకంపం ప్రజలను గతంలో సంభవించిన భూ ప్రకంపనలను గుర్తు చేసింది. ముఖ్యంగా 2024 డిసెంబర్ నెలలో ములుగు జిల్లాలోని మేడారం కేంద్రంగా రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతతో సంభవించిన భూకంపం తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు కలిగించింది. గోదావరి పరివాహక ప్రాంతంలో దాని ప్రభావం ఎక్కువగా ఉండటంతో ములుగు జిల్లా ఏటూరు నాగారంలో కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయి.
గత ఏడాది సంభవించిన భూకంపం భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ ప్రభావం చూపింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ స్వల్పంగా ప్రకంపనలు నమోదయ్యాయి. తాజాగా సంభవించిన ఈ భూకంపాల తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. భూకంపాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భూమి కంపించినప్పుడు ఇంట్లో ఉంటే దృఢమైన టేబుల్ లేదా డెస్క్ కింద ఆశ్రయం తీసుకోవాలి, బయట ఉంటే భవనాలు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. భూకంప తీవ్రత 3.8గా నమోదవడం వల్ల పెద్దగా నష్టం వాటిల్లకపోయినా, ప్రజలు అప్రమత్తంగా ఉండటం మంచిదని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa