ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినిమా అవార్డుల సంప్రదాయాన్ని తిరిగి ప్రారంభించిన రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 29, 2025, 09:10 PM

తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2024 పట్ల సినీ ప్రముఖుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అగ్ర కథానాయకుడు చిరంజీవి ఈ అవార్డుల ప్రకటనపై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. గురువారం ఎక్స్  వేదికగా అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. సినిమా అవార్డుల సంప్రదాయాన్ని తిరిగి ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా చిరంజీవి తన సందేశంలో, "గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డ్స్‌కు ఎంపికైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు నిజంగా ఎంతో విలువైనది. సృజనాత్మక రంగంలో ఉన్న ప్రతి నటుడికి, సాంకేతిక నిపుణుడికి ఇది ఎంతో ప్రేరణనిస్తుంది" అని పేర్కొన్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ అవార్డుల సంప్రదాయాన్ని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించడం గొప్ప ప్రోత్సాహాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, సంబంధిత శాఖ మంత్రులకు, అధికారులకు, అవార్డుల కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.చిరంజీవితో పాటు అగ్ర కథానాయకులు అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ కూడా గద్దర్‌ అవార్డుల ప్రకటనపై తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతి వంటి అంశాలపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా 'కమిటీ కుర్రోళ్లు' చిత్రం అవార్డును దక్కించుకుంది. ఈ చిత్రం నిర్మాత నిహారిక కొణిదెల, చిత్ర బృందం కూడా ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కళారంగానికి ఇస్తున్న ఈ ప్రోత్సాహం భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు రావడానికి దోహదపడుతుందని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa