ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తూ సీపీఎం రైతు సంఘం నేత, మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యారు. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో ఈ ఉదయం వాకింగ్కు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని దుండగులు ఆయనపై దాడి చేసి అత్యంత పాశవికంగా గొంతు కోసి చంపారు. పాతర్లపాడులో జరిగిన ఈ హత్యాకాండ స్థానికంగా తీవ్ర భయాందోళనలకు, కలకలానికి దారితీసింది. పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేయడంతో ఈ ఘటన రాజకీయ కక్షల నేపథ్యంలో జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సామినేని రామారావు సుదీర్ఘకాలంగా సీపీఎం పార్టీకి అంకితమై పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రైతు సంఘం నేతగా ఆయన రైతు సమస్యలపై గట్టిగా పోరాడారు. నిత్యం ప్రజల్లో ఉంటూ, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే రామారావుపై జరిగిన ఈ దాడి, ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతితో జిల్లాలో వామపక్ష శ్రేణుల్లో తీవ్ర విషాదం అలుముకుంది.
ఈ దారుణ హత్యపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రామారావు హత్య తనను కలచివేసిందని పేర్కొన్న ఆయన, దోషులను త్వరలోనే పట్టుకొని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో హింసా రాజకీయాలకు, అశాంతికి ఏమాత్రం తావు లేదని భట్టి విక్రమార్క గట్టిగా హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని ఆయన పునరుద్ఘాటించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. రాజకీయ కారణాలు లేదా ఇతర వ్యక్తిగత కక్షలు ఏవైనా ఈ హత్యకు దారితీశాయా అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. క్లూస్ టీం, సైబర్ టీంల సహాయంతో అన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. సీనియర్ రాజకీయ నాయకుడి హత్య నేపథ్యంలో, నిందితులను త్వరగా గుర్తించి అరెస్టు చేయాలని ఉన్నతాధికారుల నుండి పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa