రాష్ట్రంలో తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గంజాయి సహా మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఆయన చెప్పారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా సహా ఇతర నేరాలకు పాల్పడిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కందుకూరు మండలం దూబగుంటలో ‘‘స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్’’ కార్యక్రమానికి హాజరయ్యారు. స్థానికులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ను ప్రారంభించి ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛాంధ్రలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. "స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. పరిసరాలు శుభ్రంగా ఉండేందుకు అందరూ శ్రమించాలి. ఏపీని స్వచ్ఛాంధ్ర చేయాలని సంకల్పించాం. పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు నెలలో ఒక్కరోజు కేటాయించాలి. స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. నేరస్థుల పట్ల కఠినంగా ఉంటాం. ఆడబిడ్డల జోలికి వచ్చిన వారిని వదిలేది లేదు. గంజాయి ఉత్పత్తి చేస్తే ఉపేక్షించం. గంజాయి రవాణాదారులపై ఉక్కుపాదం మోపుతున్నాం. గత ప్రభుత్వంలో చెత్తపైనా పన్ను వేసి ప్రజలను వేధించారు. ప్రస్తుతం చెత్తను పునర్వినియోగం చేసేందుకు యోచిస్తున్నాం. చెత్త నుంచి సంపద సృష్టికి ప్రయత్నిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ను వైసీపీ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చింది. సంపద సృష్టిస్తేనే అభివృద్ధి జరుగుతుంది. ఏపీలో 50 శాతం పచ్చదనం పెంచేందుకు కృషి చేస్తున్నాం.ప్రతినెలా పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో 64 లక్షల మందికి రూ.33 వేలకోట్ల పెన్షన్లు ఇస్తున్నాం. గత ఐదేళ్లుగా రోడ్లపై తట్టెడు మట్టి కూడా వైసీపీ సర్కార్ వేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్లపై గుంతలన్నీ పూడ్చి వేశాం. కేవలం 8 నెలల్లోనే ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. దీపం పథకం కింద మహిళలకు ఉచిత సిలిండర్లు ఇస్తున్నాం. ప్రజల కోసం ఇంకా ఎంతో చేయాలని ఉంది. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదనే.. వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. సెల్ఫోన్ ద్వారానే సేవలు పొందేలా ఏర్పాట్లు చేశాం. ఒక్క మెసేజ్ పెడితే చాలు సర్టిఫికెట్ వచ్చేస్తుంది. యువత ఉద్యోగం చేయడం కాదు.. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి. ఎన్టీఆర్ హయాంలో మండల వ్యవస్థలు తీసుకువస్తే.. ప్రస్తుతం ప్రజల వద్దకే పాలన మేము తీసుకొచ్చామని" చెప్పారు.
![]() |
![]() |