భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ బృందం సురక్షితంగా భూమ్మీదకు చేరుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా సంతోషం వెల్లివిరుస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ కూడా సునీత విలియమ్స్ బృందానికి అభినందనలు తెలిపింది. సునీత విలియమ్స్ ఈరోజు భూమి పైకి సురక్షితంగా తిరిగి రావటం శుభపరిణామని శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. సునీతకు ఇది మూడో అంతరిక్ష యాత్ర. వివిధ కారణాల రీత్య ఈసారి ఆమె ఏకంగా 286 రోజులు అంతరిక్షంలో ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో, ఆమె మొత్తం 608 రోజులు అంతరిక్షంలో గడిపిన ఘనత సాధించారు. ఇది యావత్ మానవాళికి స్ఫూర్తిదాయకమని ఏపీ శాసన సభ స్పీకర్ వ్యాఖ్యానించారు. శాస్త్రీయ పరిశోధనలపై సునీతకు ఉన్న ఆసక్తి, పట్టుదల, క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు వెనకాడని ఆమె ధైర్య సాహసాలు ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు. మానవాళి నిరంతర ప్రగతికి ఇలాంటి ప్రయాణాలు కీలకమని అన్నారు.
![]() |
![]() |