మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని గతంలో ఉండేదని.. కానీ జగన్ జమానాలో మద్యం తాగితే ప్రాణాలు కోల్పోయేలా చేశారని విమర్శలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలు కొత్త స్కాం చేశారని ఆరోపణలు చేశారు. మద్యం అడ్డు పెట్టుకుని వైసీపీ నేతలు వేలమంది ప్రాణాలు తీశారని విమర్శించారు. ఈ అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును వాటాలుగా ముగ్గురూ పంచుకున్నారని ఆరోపించారు. ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారని అన్నారు. చిత్రగుప్తడు కూడా రాయలేని అన్నిపాపాలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి చేశారని మండిపడ్డారు. మద్యం, మైనింగ్లో భారీగా దోచుకున్నారని ఆరోపించారు. ఈ డబ్బుతోనే కుప్పంలో చంద్రబాబును గెలవనివ్వమని రంకెలు వేశారని ధ్వజమెత్తారు. మీపాపపు సొమ్ము వద్దని కుప్పం ప్రజలు చంద్రబాబుకే పట్టం కట్టారని అన్నారు. పుంగనూరులో చంద్రబాబును అడ్డుకుని దాడి చేయించారని మండిపడ్డారు. నేషనల్ క్రైం రికార్డు ప్రకారం ఏపీలో 2019-24 మధ్య మద్యం ద్వారా వందశాతం మరణాలు సంభవించాయని రిపోర్డు ఇచ్చిందని అన్నారు. ఈ పాపం పెద్దిరెడ్డి కుటుంబానిది కాదా అని ప్రశ్నించారు. ఇన్ని ప్రాణాలు తీసి మధ్యంతర బెయిల్ కోసం కోర్టుకు వెళ్లారని చెప్పారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేయని స్కాం లేదు, చేయని కబ్జా లేదన్నారు. కోర్టులో ప్రభుత్వ న్యాయవాదులు గట్టిగా వాదనలు వినిపించి బెయిల్ రాకుండా చూడాలని బుద్దా వెంకన్నకోరారు.
![]() |
![]() |