పిల్లలకు చదువుతో పాటు మంచి బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే గాడి తప్పుతూ.. దారుణంగా ప్రవర్తిస్తున్నారు. బడిలో ఉన్నాము, పిల్లల చూస్తున్నారనే విషయం కూడా మర్చిపోయి.. ఓ ఇద్దరు టీచరమ్మలు దారుణంగా కొట్టుకున్నారు. ఒకరి జుట్టు మరొకరి పట్టుకుని మరీ.. ఫైటింగ్ చేయగా పిల్లలు కూడా ఇందులో తలదూర్చారు. ఆపడానికి బదులుగా తమకు నచ్చిన వారికి సపోర్ట్ చేస్తూ మరొకరిని పొట్టు పొట్టు కొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. అంతా షాక్ అవుతున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ఉత్తర ప్రదేశ్ ఛటా పోలీస్ స్టేషన్ పరిధిలోని బహ్రావాలి గ్రామానికి చెందిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో.. ప్రీతి తివారీ అనే మహిళ ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఆ పాఠశాలకు దగ్గర్లోనే అంగన్వాడీ కూడా ఉంది. అయితే అంగన్వాడీ కార్యకర్తగా చంద్రవతి అనే మహిళ పని చేస్తోంది. అయితే ఏదో విషయంలో చంద్రవతి, ప్రతీ తివారీల మధ్య గొడవ జరిగింది. ముందుగా వాదులాడుకున్న ఈ ఇద్దరు ఆ తర్వాత ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చిన్నారుల ఎదుటే జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టున్నారు.
అయితే ఇది చూసిన విద్యార్థులు ఆ విషయాన్ని ఇతర ఉపాధ్యాయులకు చెప్పి ఆపించాల్సింది పోయి.. గొడవలో పాలు పంచుకున్నారు. తమకు నచ్చిన వారికి మద్దతు తెలుపుతూ.. కొట్టడం, కాళ్లతో తన్నడం చేశారు. అంతటితో ఆగకుండా టీచర్ల జుట్టు పట్టుకుని లాగుతూ రచ్చ రచ్చ చేశారు. వీరి కేకలు విన్న ఇతర ఉపాధ్యాయులు, ఆయా సహా అక్కడకు చేరుకుని వారిని విడిపించారు. అయితే అంగన్వాడీ కార్యకర్త చంద్రవ్వకు దాడి వల్ల తీవ్ర గాయాలు కాగా వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉండి చికిత్స పొందుతున్న చంద్రవ్వ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు వీరు గొడవ పడుతున్న సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి దీన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పెట్టగా నెట్టింట తెగ వైరల్ అయింది. చూసిన ప్రతీ ఒక్కరూ ఇదేం ఫైటింగ్ తల్లీ.. పిల్లలను ఇంత దారుణంగా తయారు చేస్తున్నారేంటంటూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వీడియో విద్యాశాఖ అధికారుల కంట పడగా.. దర్యాప్తునకు ఆదేశించారు. ఈక్రమంలోనే సదరు అధికారి ఈ గొడవ గురించి విచారించగా.. అంగన్వాడీ కార్యకర్త చంద్రవ్వ తప్పేమీ లేదని.. ముందుగా ఉపాధ్యాయురాలు ప్రీతి తివారీయే గొడవ ప్రారంభించిందని తెలిసింది. ఆమెనే కావాలని నోరు పారేసుకొని.. ముందుగా ఆమెనే కొట్టిందని బయట పడింది.
అయితే ఇంత గొడవ చేసి చంద్రవ్వపై వివరీతంగా దాడికి పాల్పడిన ఉపాధ్యాయురాలు ప్రీతి తివారీపై చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమకు ఫిర్యాదు చేస్తే ఉపాధ్యాయురాలిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.
![]() |
![]() |