జమ్మూ కశ్మీర్లో ముష్కరులతో పోరాడుతూ నలుగురు పోలీసులు వీరమరణం పొందారు. గురువారం సాయంత్రం కథువా జిల్లాలో ఎన్కౌంటర్ చోటుచేసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని, మరో ముగ్గురు నలుగురు తీవ్రవాదులు ఇంకా ఆ ప్రాంతంలో దాక్కున్నారని పేర్కొన్నాయి. అయితే, ఉగ్రవాదుల కాల్పుల్లో జమ్మూ కశ్మీర్ పోలీస్ విభాగానికి చెందిన డీఎస్పీ సమా ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారని, వీరికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని చెప్పాయి. గత ఐదు రోజులుగా ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం భారీ ఎత్తున సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
ఆర్మీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, బోర్డర్ సెక్యూరిటీ పోలీస్, జమ్మూ కశ్మీర్ పోలీస్ విభాగం ప్రత్యేక ఆపరేషన్ గ్రూప్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఐదు రోజుల నుంచి ఆ ప్రాంతంలో ముమ్మర గాలింపు కొనసాగిస్తున్నారు. ఆదివారం నాడు కాల్పులు చోటుచేసుకున్నాయి. తాము భోజనం చేస్తుండగా ఆర్మీ దుస్తుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు తనను నీళ్లు అడిగారని మంగళవారం నాడు స్థానిక మహిళ ఒకరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకుని.. ఉగ్రవాదుల కోసం జల్లెడపడుతున్నాయి. ఈ క్రమంలో దట్టమైన అటవీ ప్రాంతంలోకి గురువారం నాడు ప్రవేశించిన పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరపడంతో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. కానీ, తీవ్రవాదులతో పోరాడుతూ నలుగురు జవాన్లు నేలకొరిగారు. మరో ఐదుగురు గాయపడినట్టు అధికారులు తెలిపారు. ‘ఆపరేషన్ జరిగిన ప్రదేశం అత్యంత క్లిష్టమైన ప్రాంతం కావడం, పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు అక్కడ నక్కి ఉండటంతో చనిపోయిన పోలీసుల మృతదేహాలను ఇప్పటి వరకూ స్వాధీనం చేసుకోలేదు’ అని వెల్లడించారు. కథువా ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు జమ్మూ కశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ ధ్రువీకరించారు. అక్కడ ఉన్న మిగిలిన తీవ్రవాదులను హతమార్చుతామని పేర్కొన్నారు.
ఆదివారం సన్యాల్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ తర్వాత అక్కడ కనీసం ఐదుగురు ఉగ్రవాదులు నక్కినట్టు భావిస్తున్నారు. అక్కడ నుంచి తప్పించుకున్న ముష్కరులు.. 20 కిలోమీటర్ల దూరంలోని జుథానాకు చేరుకున్నట్టు గుర్తించారు. మొదట ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో అమెరికా తయారీ ఎం4 రైఫిల్స్ మ్యాగిజైన్స్ వదిలిపెట్టివెళ్లారని, అంటే వారి వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయనడానికి ఇది సూచన అని సైనికాధికారులు వివరించారు. గురువారం ఉదయం జుథానా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు గుర్తించారు. ఈ క్రమంలోనే ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఆపరేషన్ కోసం హెలికాప్టర్లు, డ్రోన్లు, బుల్లెట్ప్రూఫ్ వాహనాలు, స్నినప్పర్ డాగ్స్ సాయం తీసుకున్నారు. అలాగే, పలువురు స్థానికులను ప్రశ్నించి.. ముగ్గురు అనుమానితులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.
![]() |
![]() |