ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దీదీ రాయల్ బెంగాల్ టైగర్.. నన్నెవరూ ఆపలేరు..: ఆక్స్‌ఫర్డ్ విద్యార్థులకు మమతా బెనర్జీ షాక్

national |  Suryaa Desk  | Published : Fri, Mar 28, 2025, 07:47 PM

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రస్తుతం యూకే పర్యనటలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్లి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కానీ మధ్యలోనే కొందరు నిరసనకారులు రచ్చ చేశారు. మీరు మాట్లాడడానికి వీళ్లేదంటూనే పలు ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా ఎన్నికల తర్వాత బెంగాల్‌లో జరిగిన హింస, కోల్‌కతా ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారానికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వీటికి ఏమాత్రం జంకని దీదీ.. నేను రాయల్ బెంగాల్ టైగర్, నన్ను ఎవరూ పట్టుకోలేరంటూ వ్యాఖ్యానించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


లండన్ పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని కెల్లాగే కాలేజీకి వెళ్లారు. అక్కేడ సామాజిక అభివృద్ధి మహిళా సాధికారత అంశంపై మాట్లాడారు. కానీ ఆమె మాట్లాడుతుండగానే కొందరు విద్యార్థులు లేచి నిలబడ్డారు. ఆర్జీకార్ ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం, ఎన్నికల తర్వాత బెంగాల్‌లో జరిగిన హింస గురించి నిరసిస్తూ రాసిన ఫ్లకార్డులు చేత పట్టుకుని దీదీని ఆపే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఆర్జీకార్ హత్యాచార ఘటనపై సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు.


అలాగే ఒకేసారి అనేక మంది విద్యార్థులు మాట్లాడుతుండగా.. ఆ కార్యక్రమంలో గందరగోళం ఏర్పడింది. ఈ సమయంలోనే సీఎం మమతా బెనర్జీ కాస్త గట్టిగా మాట్లాడండి వినపడం లేదంటూ చెప్పారు. మీరు చెప్పేదంతా నేను వింటాను కాస్త ప్రశాంతంగా మాట్లాడమని వివరించారు. కానీ వారు లేవనెత్తిన అంశాల గురించి విన్నాకా.. ఇక్కడ రాజకీయాలు చేయొద్దని, ఇది రాజకీయాలకు వేదిక కాదంటూ వివరించారు. దీని గురించి ఏదైనా మాట్లాడాలనుకుంటే తన రాష్ట్రానికి వచ్చి మాట్లాడాలని సూచించారు. అలాగే జాదవ్ పూర్ విశ్వవిద్యాలయ సంఘటన అంశాన్ని కూడా నిరసనకారులు లేవనెత్తగా.. దీదీ ఓ నిరసన కారుడిని ఉద్దేశిస్తూ మాట్లాడింది.


మీ పట్ల నాకు సానుభూతి ఉందంటూనే.. దీన్ని ఇక్కడ చర్చించే బదులు బెంగాల్‌కు వెళ్లి మీ పార్టీని బలోపేతం చేసుకోమని చెప్పాలంటూ వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ ఇలా మాట్లాడగానే.. గ్యాలరీలో కూర్చున్న అతిథులంతా బిగ్గరగా చప్పట్లు కొట్టారు. ఆపై మళ్లీ దీదీ మాట్లాడుతూ.. నేను భారత దేశ ప్రతినిధిగా వచ్చాను, ఇక్కడ నన్ను అవమానించి మీ సంస్థ పరువు తీసుకోకండి అని చెప్పారు. దీంతో కార్యక్రమ నిర్వాహకులు నిరసనకారులను అడ్డుకుని అక్కడి నుంచి పంపించి వేశారు.


ఆ తర్వాత కూడా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. దీదీ ఎవరినీ పట్టించుకోదు, దీదీ రాయల్ బెంగాల్ టైగర్‌లా వ్యవహరిస్తుంది, నన్ను పట్టుకోవాలంటో పట్టుకో అంటూ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. దీదీ గ్రేట్ అంటూ కామెంట్లలో రాసుకొస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com