ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్యాంకాక్‌లో భూకంపం.. ఎత్తైన భవనం కూలిన ఘటనలో 90 మంది గల్లంతు

international |  Suryaa Desk  | Published : Fri, Mar 28, 2025, 07:58 PM

థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో శుక్రవారం రోజు మధ్యాహ్నం పెద్ద ఎత్తున భూకంపం సంభవించింది. అక్కడి ఎత్తైన భవనాలు, ఇళ్లు పేక మేడల్లా పడిపోయాయి. ముఖ్యంగా నిర్మాణంలో ఉన్న ఓ ఎత్తైన భవనం కూలిన ఘటనలో మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ రక్షణ శాఖ మంత్రి తాజాగా వెల్లడించారు. అలాగే 90 మంది వరకు గల్లంతు అయినట్లు వివరించారు. అంతేకాకుండా సహాయక చర్యలు చేపట్టి ఏడుగురి ప్రాణాలు కాపాడినట్లు స్పష్టం చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


శుక్రవారం రోజు మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో మయన్మార్ సహా థాయ్‌లాండ్‌లోనూ పెద్ద ఎత్తున భూకంపం సంభవించింది. ముఖ్యంగా రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతో భూకంపం రాగా.. అనేక భవనాలు, ఇళ్లు పేక మేడల్లా కూలిపోయాయి. ఒక్కసారిగా భూమి కంపించగా.. ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు బిల్డింగులు, భవనాల్లోంచి బయటకు పరుగులు తీశారు. అదృష్ట వశాత్తు కొందరు బతికి బయటపడగా.. మరికొందరు మాత్రం భవనాల కిందే పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. ఎంత మొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లిందనే దానిపై ఏ ఒక్క దేశమూ క్లారిటీ ఇవ్వలేదు.


కానీ తాజాగా థాయ్‌లాండ్‌ మంత్రిత్వ శాఖ స్పందించింది. ముఖ్యంగా ఆ దేశ రాజధాని బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న ఓ ఎత్తైన భవనం కూలిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. అలాగే 90 మందికి పైగా గల్లంతు అయినట్లు వివరించింది. అయితే సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది మొత్తంగా ఏడుగురిని రక్షించినట్లు వెల్లడించింది. ఒక బిల్డింగ్ కూలిన ఘటనలోనే ఇంత మంది బాధితులు ఉండగా.. దేశ వ్యాప్తంగా ఇలాంటివి ఇంకెన్ని ఉంటాయోనంటూ ప్రజలు కామెంట్లు చేస్తున్నారు.


ఇదిలా ఉండగా బ్యాంకాక్‌లోని భారత రాయబార కార్యాలయం అప్రమత్తమై.. భారతీయుల సహాయార్థం హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. బాధితుల కోసం +66618819218 నంబర్‌ను జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఈ నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించింది. అంతేకాకుండా థాయ్‌లాండ్‌ అధికారుల సమన్వయంతో దేశంలోని తాజా పరిస్థితిని క్షణ క్షణం పరిశీలిస్తున్నామని చెప్పింది. అలాగే ఇప్పటి వరకు ఈ భూకంపం వల్ల బ్యాంకాక్‌లో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోయినట్లు, గాయపడినట్లు ఇప్పటి వరకు ఎలాంటి నివేదికలు రాలేవని చెప్పింది. రాయబార కార్యాలయం, కాన్సులేట్ సభ్యులు సైతం సురక్షితంగా ఉన్నట్లు ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com