ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మయన్మార్‌లో భారీ భూకంపం.. భవనాలు కూలుతున్న విషాద దృశ్యాలు

international |  Suryaa Desk  | Published : Fri, Mar 28, 2025, 08:00 PM

మయన్మార్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతగా నమోదైనట్టు అమెరికా జియలాజికల్ సర్వే తెలిపింది. పశ్చిమ మండేలాలోని సగైంగ్ పట్టణానికి 16 కి.మీ ఉత్తర-వాయవ్య దిశలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు పేర్కొంది. ఇది భూమికి 10 కి.మీ లోతులో ఉందని, ఈ భూకంపం పొరుగున ఉన్న దేశాల్లో కూడా ప్రభావాన్ని చూపిందని వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.50 గంటలకు భూకంపం సంభవించినట్టు పేర్కొంది. అటు, థాయిలాండ్ సహా, దాని రాజధాని బ్యాంకాక్‌లోనూ 7.3 తీవ్రతతో భూకంపం చోటుచేసుకుంది. దీంతో ప్రజలు భవనాలను ఖాళీ చేసి.. బయటకు పరుగులు తీశారు.


అటు, భారత్, చైనాలోనూ భూ ప్రకంపనలు నమోదయ్యాయి. సరిహద్దుల్లోని రాష్ట్రాల్లో భూప్రకంపలు నమోదయినట్టు జాతీయ సిస్మాలజీ సెంటర్ గుర్తించింది. కాగా, మయన్మార్‌లో భూకంప నష్టం గురించి సమాచారం తెలియాల్సి ఉంది. మయన్మార్ రాజధాని నెపిడాకు 250 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం చోటుచేసుకుంది. సగైంగ్ పట్టణానికి 16 కి.మీ. దూరంలో తొలుత 7. 7 తీవ్రతతోనూ.. తర్వాత కొద్ది సేపటికే 6.4 తీవ్రతతోనూ మరొకటి.. దీని తర్వాత 4.9 తీవ్రత మరొకటి ఇలా మూడు వరుస భూకంపాలు సంభవించినట్టు యూఎస్ జియాలాజికల్ సర్వే పేర్కొంది. ఈ నగరంలో దాదాపు 15 లక్షల మంది జనాభా నివసిస్తున్నట్టు తెలిపారు.


ఇక, సోషల్ మీడియాలో భూకంపానికి సంబంధించిన పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. భూకంప తీవ్రతకు భారీ భవనాలు, ఊగిపోతుంటే.. ప్రజలు ప్రాణభయంతో వీధుల్లో పరుగులు పెడుతున్నారు. అటు, మయన్మార్ సరిహద్దుల్లోని సెంట్రల్, నార్త్ థాయ్‌లాండ్‌లోనూ భూకంపం ప్రభావం తీవ్రంగానే ఉన్నట్టు తెలుస్తోంది. భూకంపం సంభవించిన ప్రదేశంలోని 1000 పడకల ఆసుపత్రి క్షతగాత్రులతో నిండిపోయింది. ఇప్పటి వరకూ 20 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. భవనాలు కుప్పకూలిపోవడంతో వాటి శిథిలాల కింద బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు గుర్తించారు. వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


మయన్మార్ (బర్మా)లో బ్రిటిషర్ల కాలంలో 1934లో ఇర్రవడీ నదిపై నిర్మించిన ఐకానిక్ వంతెన ది అవా బ్రిడ్జి.. భూకంపం ధాటికి తీవ్రంగా ధ్వంసమైంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మయన్మార్ ఎగువ ప్రాంతంలో చాలా భవనాలను భూకంపం కారణంగా ధ్వంసమయ్యాయి. భూకంపంతో పలు భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. వీటికి సమీపంలో ఉన్నవారు తమ ప్రాణాలను కాపాడుకోడానికి అక్కడ నుంచి పరుగులు పెడుతున్నారు. ఓ భవనంపై ఉన్న స్విమ్మింగ్ పూల్ నుంచి నీళ్లు బయటకు వచ్చిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com