ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సముద్రంలో మునిగిపోయిన పర్యాటకుల సబ్-మెరైన్‌.. ఆరుగురు మృతి

international |  Suryaa Desk  | Published : Fri, Mar 28, 2025, 08:04 PM

ఈజిప్టు తీరంలోని ఎర్ర సముద్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. పర్యాటకుల సబ్-మెరైన్ మునిగిపోయి ఆరుగురు మృతిచెందగా.. మరో 9 మంది వరకు గాయపడ్డారు. ప్రమాదం నుంచి మరో 29 మంది సురక్షితంగా బయటపడ్డారు. గాయపడినవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. గుర్గాడా తీరంలో సింధ్‌బాద్ అనే సబ్‌-మెరైన్ హార్బర్ దగ్గర మునిగిపోయింది. ప్రమాదం జరిగే సమయానికి అందులో 40 మందికి పైగా పర్యాటకులు ఉన్నారు. వారంతా రష్యన్ పౌరులని గుర్తించారు. ఎర్ర సముద్రం అడుగున పగడపు దిబ్బలు, రంగురంగుల చేపలను చూసేందుకు సబ్‌మెరైన్ సాయంతో 72 అడుగుల లోతు వరకు వెళ్తుంటారు.


డైలీ మెయిల్ కథనం ప్రకారం.. ప్రమాదం జరిగిన వెంటనే 21 అంబులెన్స్‌లను ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. చాలా ఏళ్లుగా పర్యాటకులకు సేవలు అందించే సింధ్‌బాద్ సబ్-మెరైన్.. సముద్రంలో 25 మీటర్ల (82 అడుగులు) లోతున 500 మీటర్ల విస్తీర్ణంలోని పగడపు దిబ్బలు, సముద్ర జీవుల చెంతకు తీసుకెళ్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 14 పర్యాటక సబ్‌-మెరైన్‌లలో ఒకటైన దీనిని... ఫిన్లాండ్‌లో తయారు చేశారు. ఇందులో 44 మంది పర్యాటకులు, ఇద్దరు సిబ్బంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. టిక్కెట్ ధరల విషయానికి వస్తే పెద్దలకు 69 డాలర్లు, పిల్లలకు 33 డాలర్లు.


ప్రమాద సమయంలోని సబ్-మెరైన్‌లో ఉన్నవారంతే తమ దేశ పౌరులేనని రష్యా రాయబార కార్యాలయం ఫేస్‌బుక్‌లో తెలిపింది. అందులో మైనర్లతో సహా 45 మంది రష్యన్ పర్యాటకులు ఉన్నారని పేర్కొంది. చాలా మందిని రక్షించి హోటళ్లు, ఆసుపత్రులకు తరలించారని, ఎవరికీ పెద్దగా ప్రమాదం లేదని వెల్లడించింది.


ఘటన గురించి సమాచారం తెలిసిన వెంటనే రష్యా దౌత్య సిబ్బంది అక్కడకు చేరుకుని.. బాధితులకు అవసరమైన సహాయం అందిస్తున్నారు. అయితే, ఈజిప్టులో పర్యాటక నౌక ప్రమాదాలు సర్వసాధారణమే. గతేడాది నవంబరులో మార్సా అలామ్ సమీపంలోని ఎర్ర సముద్రంలో 44 మంది ప్రయాణికులతో వెళ్తున్న పర్యాటక పడవ మునిగిపోయింది. పెద్ద అల తాకడం వల్ల పడవ బోల్తా పడిందని దర్యాప్తులో తేలింది. ఈ ప్రమాదంలో 28 మందిని రక్షించినట్టు గవర్నర్ అమర్ హనాఫీ తెలిపారు.ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. దీనికి ముందు సీ స్టోరీ అనే ఆ పడవలో 13 మంది ఈజిప్షియన్లు సహా 31 మంది విదేశీయులతో వెళ్తుండగా.. సముద్రంలో ప్రమాదానికి గురయ్యింది. కాగా, రెండేళ్ల కిందట అట్లాంటిక్ తీరంలో టైటానిక్ సబ్-మెరైన్ ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com