తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇటీవల తొలగించిన వారిని వెంటనే తిరిగి తీసుకోవాలని, గేట్ పాస్లు గతంలో మాదిరిగా ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లతో స్టీల్ప్లాంటులో కాంట్రాక్టు కార్మికులు శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి 24 గంటల సమ్మె ప్రారంభించారు. కార్మికులు ఉదయం ఆరు గంటలకు ప్లాంటు గేట్ల (ప్రధాన గేటు, బీసీ గేటు, విస్తరణ గేటు) వద్దకు చేరుకున్నారు. ఉక్కు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొమ్మిది గంటల సమయంలో ప్లాంటు లోపలకు వెళ్లినప్పటికీ విధులను బహిష్కరించి, ఆయా విభాగాధిపతుల కార్యాలయాల వద్దకు చేరుకుని నిరసన తెలియజేశారు. సాయంత్రం నాలుగు గంటలకు కోక్-ఓవెన్ విభాగం వద్దకు చేరుకొని అక్కడ నుంచి ప్రధాన పరిపాలనా భవనం వరకూ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన పరిపాలనా భవనం లోపలకు వెళ్లేందుకు కార్మికులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గేటు ముందు కార్మికులు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
![]() |
![]() |