నిరుపేదల అభ్యున్నతికి తోడ్పడే పీ-4 సర్వేను వారంలోగా పూర్తి చే యాలని, సర్వేలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. శుక్రవారం గుడ్లవల్లేరు మండల పరిషత్ కార్యాలయంలో సర్వే నిర్వహిస్తున్న ఏపీ మాస్ సంస్థ సర్వే బృందంతో ఆయన సమీక్ష నిర్వహించారు. సర్వే నిర్వహిస్తున్న తీరును ఆయన అడిగి తెలుసుకొన్నారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా మండలంలోని కుచికాయలపూడిని తీసుకుని సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. మండలంలో ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న సర్వే 80 శాతం పూర్తయ్యిందని, మిగిలిన 20 శాతం వచ్చే వారంలో పూర్తవ్వాలన్నారు. కనీస సదుపాయాలు లేని కుటుంబాలు ఏవి..ఏ జీవనోపాధి కల్పిస్తే వారు వృద్ధిలోకి వస్తారు వంటి వివరాలు సేకరించాలన్నారు. ఇళ్ల నిర్మాణం మధ్యలో నిలిచి పోయిందా ఏకారణం వల్ల నిలిచి పోయింది. పిల్లల చదువుకు అంతరాయం కలిగితే ఎందుకు కలిగిందో సర్వేలో సేకరించాలన్నారు. అనారోగ్య సమస్యలు ఉన్నా సేకరించాలన్నారు. నిరుద్యోగ యువత ఉంటే వారికి ఏ నైపుణ్య శిక్షణ అవసరం, ఏ పని చేస్తే ఉపయోగం కలుగుతుందో సంగ్రహించాలని స్పష్టం చేశారు. డీఆర్డీయే పీడీ హరిహరనాథ్, గుడివాడ ఆర్డీవో బాలసుబ్రహ్మణ్యం, ఏపీ మాస్ అధ్యయన బృందం నాయకురాలు ఎ.కళామణి, డివిజనల్ పంచాయతీ అధికారి పి.సుజాత, ఎంపీడీవో టి.విజయసారథి, తహసీల్దారు లోకరాజు, ఎస్ఐ సత్యనారాయణ పాల్గొన్నారు.
![]() |
![]() |