ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వక్ఫ్ బిల్లు 2025ను ఛాలెంజ్ చేస్తూ.. సుప్రీంకోర్టులో రెండు పిటిషన్‌లు

national |  Suryaa Desk  | Published : Sat, Apr 05, 2025, 09:14 PM

వక్ఫ్ బిల్లు వ్యవహారం మరో మలుపు తిరిగింది.. పార్లమెంట్‌లో బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత ఊహించని పరిణామం ఎదురైంది.


వక్ఫ్‌ సవరణ బిల్లు-2025ను కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశాయి. కాంగ్రెస్‌ ఎంపీ మహ్మద్‌ జావేద్‌ (బీహార్‌); ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీలు వేర్వేరుగా సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపకముందే కోర్టును ఆశ్రయించారు. ఈ వక్ఫ్ బిల్లు నిబంధనలు ముస్లిం సమాజ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ సవరణలు ముస్లింల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తాయని.. ఇస్లామిక్ మతపరమైన ఆస్తులపై ప్రభుత్వం ఎక్కువ నియంత్రణ పెట్టేలా ఉందని వారు ఆరోపిస్తున్నారు.


జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడైన కాంగ్రెస్ ఎంపీ జావేద్ ఈ సవరణలను వ్యతిరేకిస్తున్నారు. ఈ సవరణలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25, 26, 29, 300ఏ లను ఉల్లంఘిస్తాయనే వాదనను వినిపిస్తున్నారు. ఈ ఆర్టికల్స్ సమానత్వం, మత స్వేచ్ఛ, మైనారిటీ హక్కులు, ఆస్తి హక్కులకు సంబంధించినవని.. ఈ బిల్లు వల్ల ఆంక్షలు వస్తాయన్నారు. కొత్తగా ఇస్లాం మతంలోకి మారినవారు వక్ఫ్ కింద ఆస్తులను ఇవ్వలేరని.. ఇది ఇస్లామిక్ చట్టానికి విరుద్ధమంటున్నారు జావేద్.


'వక్ఫ్ బోర్డుల్లో, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లింలు కాని సభ్యులను చేర్చాలనే ప్రతిపాదన కూడా వివాదాస్పదంగా ఉంది. ఇలా ముస్లింలు కాని వారి జోక్యం సమర్థనీయం కాదు.. ఏకపక్షంగా ఉంది. హిందూ, సిక్కు మతపరమైన ట్రస్టుల నిర్వహణలో ఇలాంటి జోక్యం లేదు. మరికొందరు పిటిషన్‌లు వేస్తారు, మరికొన్ని పార్టీలు దీనిని వ్యతిరేకిస్తాయి. పార్లమెంటులో ప్రతిపక్షాలు ఇది రాజ్యాంగ విరుద్ధమని చెప్పాయి. మా హక్కును ఎలా లాక్కుంటారు? మీ దగ్గర సంఖ్యా బలం ఉందని మీరు ఏదైనా చేయాలనుకుంటే, అది చట్టవిరుద్ధం అవుతుంది' అన్నారు జావేద్


ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ బిల్లు ద్వారా ముస్లింల హక్కులను ఉల్లంఘించడమే అని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో చర్చ సందర్భంగా బిల్లు కాపీని చించేశారు. తన నిరసన దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ చేసిన సహాయ నిరాకరణతో పోల్చారు. గాంధీలాగే తాను కూడా ఈ చట్టాన్ని చించివేస్తున్నానని.. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. బీజేపీ దేవాలయాలు, మసీదుల పేరుతో దేశంలో విభజన సృష్టించాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో చర్చ సమయంలో.. తాను చేసిన 10 సవరణలను పరిశీలించాలని అసదుద్దీన్ కేంద్రాన్ని కోరారు. ఈ బిల్లు ముస్లింల హక్కులను తగ్గిస్తుందని.. వక్ఫ్ అంటే ముస్లింలు తమ ఆస్తులను దానధర్మాలు చేయడానికి.. పేద ప్రజలకు సహాయం చేయడానికి అన్నారు. అలాగే మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. కానీ ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం వక్ఫ్ బోర్డులపై నియంత్రణ సాధించాలని చూస్తోందన్నారు. ఈ బిల్లుతో ముస్లింల హక్కులకు భంగం కలుగుతుందన్నారు. మొత్తం మీద ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఎపిసోడ్ సుప్రీం కోర్టుకు చేరింది. మరి అక్కడ ఏం జరుగుతుంది.. కోర్టు ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com