ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరంపై అసత్య ప్రచారాలు ఎందుకు చంద్రబాబు?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 06, 2025, 07:26 AM

రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌ను బ్యారేజీగా మార్చే కుట్రకు చంద్రబాబు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ తన స్వార్థ ప్రయోజనాల కోసం పోలవరం ఎత్తు తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం వద్ద చంద్రబాబు రాజీ పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా కేంద్రం ముందు తాకట్టు పెడుతున్న చంద్రబాబు చరిత్రలో ద్రోహిగా మిగిలిపోతాడని అన్నారు. అయన మాట్లాడుతూ..... రాష్ట్ర విభజన సమయంలో పోలవరంను జాతీయ ప్రాజెక్ట్‌గా కేంద్రమే నిర్మించి ఇస్తుందని, ఏపీకి ప్రత్యేకహోదాను ఇచ్చి ఆదుకుంటుందని కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చింది. విభజన తరువాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు ఏపీకి తీరని అన్యాయం చేశాడు. తన కమీషన్ల కోసం రాష్ట్రమే పోలవరం ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుందని కేంద్రాన్ని ఒప్పింది, అందుకు బదులుగా ప్రత్యేకహోదా హామీని వదులుకున్నారు. పోలవరంను అయినా నిర్మించారా అని చూస్తే ఆయన పాలనలో ఒక ప్రణాళిక లేకుండా, అస్తవ్యస్త విధానాలతో పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని సర్వనాశనం చేశారు. పోలవరంకు గానూ ముందుగా స్పిల్‌వేను నిర్మించాల్సి ఉంది. దీనికి చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి చొరవ తీసుకోలేదు. కేవలం తనకు కలిసి వస్తుందనే ఆలోచనతో అప్పర్, లోయర్ కాఫర్ డ్యాంలను చేపట్టాలని ప్రయత్నించారు. వాటిని పూర్తి చేయకుండా గ్యాప్‌లను ఉంచి, డయాఫ్రంవాల్‌ ను నిర్మించారు. అప్పర్ కాఫర్ డ్యాంలో స్పిల్ వే లేకపోవడం వల్ల కాఫర్ డ్యాంపై ఒత్తిడి పెరిగి వరదతో అవి దెబ్బతిన్నాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు తన నిర్వాకాన్ని కప్పిపుచ్చుకుంటూ అధికారంలో ఉన్న వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపైనే నిందలు మోపేందుకు విశ్వప్రయత్నం చేశాడు. కేంద్రంలోని పోలవరం అథారిటీ దెబ్బతిన్న డయాఫ్రంవాల్‌ను పరిశీలించి నివేదిక అందించడంలో జాప్యం జరిగింది. అప్పటి వరకు పోలవరం పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు సీఎం కాగానే పోలవరంపై కొత్త అబద్దాలను తెర మీదికి తీసుకువచ్చారు. వైయస్ జగన్ కారణంగానే పోలవరం ఆలస్యమైందంటూ పచ్చి అబద్దాలను చెబుతున్నారు. పోలవరం నిర్మాణం 78 శాతం పూర్తయ్యిందని ఒకవైపు చంద్రబాబు ఊదరగొడుతుంటే, కాదు కేవలం 53 శాతం మాత్రమే పూర్తయ్యిందని కేంద్రం స్పష్టం చేసింది అని తెలిపారు. . 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com