ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు గారి ఆరోగ్య సూత్రాలు.... ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి చేయాల్సిందే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 07, 2025, 07:52 PM

వైద్యం, ఆరోగ్యంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా  ఏపీలో హైపర్ టెన్షన్, డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయని ఆయన  తెలిపారు. ఈ నేపథ్యంలో ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  ప్రతి రోజూ ఎంతమేరకు చక్కెర, వంటనూనె, ఉప్పు వాడాలనే దానిపై చంద్రబాబు వివరాలు వెల్లడించారు. వంట నూనె, ఉప్పు, చక్కెర వాడకం తగ్గిస్తే పలు అనారోగ్యాల నుంచి తప్పించుకోవచ్చన్నారు.  వైద్య ఖర్చులు, పెరుగుతున్న వ్యాధులపై ఆయన అనేక వివరాలు వెల్లడించారు. ఇక ఏపీలో మగవారిలో కంటే మహిళల్లో హైపర్ టెన్షన్ ఎక్కువగా కనిపిస్తోందని, డయాబెటిస్ కూడా పెరుగుతోందని చంద్రబాబు వెల్లడించారు. వ్యాధుల నివారణకు చంద్రబాబు పలు ఆరోగ్య సూత్రాలు, ఆహారపు అలవాట్ల గురించి వివరించారు. నలుగురు సభ్యులు ఉన్న కుటుంబం రోజుకు 4 గ్రాముల ఉప్పు వాడాలని చంద్రబాబు సూచించారు. ఈ లెక్కన నెలకు 600 గ్రాములకు మించి ఉప్పు వాడకూడదని అన్నారు.


అలాగే వంటనూనెను కూడా రోజుకు 15 గ్రాములు చొప్పున వాడాలని.. ఈ ప్రకారం నలుగురు సభ్యులు ఉన్న కుటుంబం నెలకు 2 లీటర్ల మాత్రమే వంటనూనె ఉపయోగించాలన్నారు. ఇక చక్కెర వాడకం కూడా తగ్గించాలన్న చంద్రబాబు.. రోజుకు 25 గ్రాముల చొప్పున చక్కెర వాడాలన్నారు. ఈ లెక్క ప్రకారం నెలకు 3 కేజీల చక్కెర ఉపయోగిస్తే చాలని సూచించారు. ఈ మూడు తగ్గిస్తే చాలా వరకూ అనారోగ్య సమస్యలు తగ్గుతాయని.. అలాగే రోజూ కనీసం అరగంట తేలికపాటి వ్యాయామం చేయాలని సూచించారు. అందరూ ప్రాణాయామం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక ప్రజల ఆరోగ్యం కోసం ఏపీ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేసే న్యూట్రిఫుల్ యాప్ తెచ్చిందన్న చంద్రబాబు నాయుడు.. ఈ యాప్‌ను ఇప్పటి వరకూ 4 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నట్లు వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com