ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రవాసాంధ్రుల భూమి, ఆస్తి తగాదాల సమస్యల పరిష్కారం కోసం.... ప్రత్యేక సెల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 08, 2025, 07:26 PM

ప్రవాసాంధ్రులు ఎదుర్కొనే భూమి, ఆస్తి, ఇతర అంశాలపై ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనుంది. ఎన్ఆర్‌టీల ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ఏర్పాటు ద్వారా ప్రవాసాంధ్రులకు రాష్ట్రంపై విశ్వాసం పెంపొందించాలని,, పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.


ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినా అక్కడో భారతీయుడు, అందులోనూ తెలుగువారు ఉంటారనేది జగమెరిగిన సత్యం. అయితే విదేశాల్లో కష్టపడుతూ.. తమ కష్టార్జితాన్ని స్వస్థలాలలో పెట్టుబడులకు ఉపయోగించే ఎన్నారైలు (ప్రవాస భారతీయులు), అందులోనూ ప్రవాసాంధ్రులు (నాన్ రెసిడెంట్ తెలుగు - ఎన్ఆర్‌టీ) పలు అంశాలలో ఇబ్బందులు పడుతున్నారు. మరీముఖ్యంగా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు, కొనుగోలు చేసిన ఆస్తిపాస్తుల విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నారైల భూములు అక్కడక్కడా కబ్జాలకు గురౌతున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రవాసాంధ్రులు పడుతున్న సమస్యల పరిష్కారం జిల్లా స్థాయిలో ప్రత్యేక సెల్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే ఆస్తి, చట్టపరమైన, పరిపాలనా సమస్యలపై ఈ స్పెషల్ సెల్‌లో ఫిర్యాదులు స్వీకరిస్తారు.


ప్రవాసాంధ్రులు ముఖ్యంగా ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాలు, చట్టపరమైన సమస్యలు, పరిపాలన విషయాల్లో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా, భూమి, ఆస్తి, ఆర్థిక మోసాలు, వైవాహిక వివాదాలకు సంబంధించిన ఫిర్యాదుల సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి ఫిర్యాదులను ప్రస్తుతమున్న ఎన్ఆర్ఐ గ్రీవెన్స్ సెల్, జిల్లా పోలీసులు, సివిల్ కోర్టుల ద్వారా పరిష్కరించేందుకు సుదీర్ఘ సమయం పడుతోంది. అలాగే సొంతూర్లకు దూరంగా ఉండటం కూడా ఇలాంటి వివాదాలను పరిష్కరించుకోవటంలో ఎన్ఆర్ఐలకు ఇబ్బందికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్ఆర్టీల ఫిర్యాదుల పరిష్కారానికి కేంద్రీకృత విధానం అవసరమని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రవాసాంధ్రుల ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా స్థాయిలోనే ఓ వ్యవస్థ ఏర్పాటుచేసేందుకు అంగీకారం తెలిపారు. ఈ క్రమంలోనే అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి.


జిల్లా స్థాయిలో కలెక్టరేట్ల ప్రాంగణంలో ఈ ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా ప్రవాసాంధ్రుల ఫిర్యాదుల పరిష్కారం కోసం సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. ఈ ప్రత్యేక సెల్‌లో ప్రవాసాంధ్రుల ఆస్తి, భూమికి సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి ఎమ్మార్వో కేడర్ అధికారి, క్రిమినల్ కేసులు, వైవాహిక వివాదాలు, మోసాల ఫిర్యాదుల పరిష్కారం కోసం పోలీస్ అధికారిని నియమించనున్నారు. అలాగే ఎన్ఆర్‌టీలు ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు అందించేందుకు ఓ ఆన్‌లైన్ పోర్టల్ అందుబాటులోకి తేనున్నారు. వ్యక్తిగతంగా అంత దూరం నుంచి రాలేని నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కూడా కల్పించనున్నారు. అలాగే అవసరమైన న్యాయసహాయం కూడా అందించనున్నారు.


జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ఈ ప్రత్యేక విభాగాల ద్వారా ఎన్ఆర్టీ సమస్యలను పరిష్కరించడంలో పారదర్శకత, సామర్థ్యం, జవాబుదారీతనం మెరుగుపరచవచ్చనేది ప్రభుత్వం ఆలోచన. ఈ చర్యల ద్వారా ప్రవాసాంధ్రులలో రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం పెంచి పెట్టుబడులను ఆకర్షించవచ్చని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రత్యేక విభాగాలు ప్రవాసాంధ్రులకు, సంబంధిత శాఖలకు మధ్య అనుసంధానకర్తగా ఉంటూ వారి ఫిర్యాదులకు సకాలంలో పరిష్కారాలు అందించేందుకు పనిచేస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com