ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొరపాటుతో మరొకరి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

international |  Suryaa Desk  | Published : Sat, Apr 12, 2025, 10:34 PM

ఆస్ట్రేలియాలోని ప్రముఖ సంతానోత్పత్తి కేంద్రాల్లో ఒకటైన మోనాష్ ఐవీఎఫ్ సెంటర్‌లో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా బ్రిస్బేన్‌లో ఉన్న ఈ ఆస్పత్రికి వందలాది మంది జంటలు అనేక సమస్యలతో వస్తుంటారు. వారిలో ఉన్న లోపాలను గుర్తించి.. వైద్యులు మహిళల పిండాలను కృత్రిమ పద్ధతిలో ఫలదీకరణ చేస్తారు. ఆపై వారి వారి పిండాలను మహిళల గర్భాల్లో ప్రవేశ పెట్టి వారు తల్లులు అయ్యేలా చేస్తుంటారు. అయితే ఇలాగే చేయించుకునేందుకు వచ్చిందో జంట. ముఖ్యంగా తమ పిండాలను అదే ఆస్పత్రిలో భద్ర పరుచుకుంది. కొంత కాలం తర్వాత తమకు పిల్లలు కావాలనుకుని ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు ఐవీఎఫ్ చికిత్స చేశారు. ఇలా సదరు మహిళ గర్భం దాల్చింది. 9 నెలల మోసి ఓ బిడ్డకు జన్మనిచ్చింది.


ఇదంతా బాగానే ఉండగా... గతేడాది ఇదే ఆస్పత్రిలో వందల మంది మహిళల ఎంబ్రియోలు పాడయ్యాయి. వాటిని భద్రంగా ఉంచేందుకు అవకాశం ఉన్నప్పటికీ పాడు కావడంతో ఐవీఎఫ్ సెంటర్ తమ తప్పును ఒప్పుకుంది. బాధితులు అందరికీ క్షమాపణ చెబుతూనే.. పెద్ద మొత్తంలో నష్ట పరిహారం చెల్లించింది. ముఖ్యంగా 56 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.480 కోట్లు) అందజేసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న సదరు జంట బిడ్డ పుట్టిన తర్వాత అంటే 2025 ఫిబ్రవరిలో ఆస్పత్రికి వచ్చారు. మిగిలిన తమ పిండాలను ఇతర ఆస్పత్రికి బదిలీ చేయాలని కోరారు. దీంతో సిబ్బంది సైతం ఆ పని చేయాలని చూసింది. అక్కడే తాము చేసిన తప్పును గుర్తించింది.


ఈ జంటకు సంబంధించిన పిండాలు అన్నీ అక్కడే ఉన్నాయని.. అయితే వేరొకరి పిండాన్ని సదరు మహిళ గర్భంలో ప్రవేశ పెట్టినట్లు వెల్లడించింది. ఇది తెలుసుకున్న జంట ఆస్పత్రి యాజమాన్యంతో గొడవకు దిగారు. తమకు బిడ్డ కూడా పుట్టాకా ఇలా చెబితే ఎలా అంటూ నిలదీశారు. ముఖ్యంగా ఐవీఎఫ్ సెంటర్ సీఈఓ మైఖేల్ నాప్ దీనిపై స్పందించి సోషల్ మీడియా వేదికగా తమ తప్పును ఒప్పుకున్నారు. ఇటు బిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో పాటు బయోలాజికల్ తల్లిదండ్రులకు కూడా క్షమాపణలు చెప్పారు. తాము చేసిన తప్పు వల్లే ఇదంతా జరిగిందని.. అయితే ఆస్పత్రిలో ఇలా జరగడం ఇదే తొలిసారని వివరించారు. మరే జంటకు ఇలా జరగలేదని.. బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని క్లారిటీ ఇచ్చారు.


అయితే తల్లైన జంట, బయోలాజికల్ తల్లిదండ్రులు ఎవరు, బిడ్డను ప్రస్తుతం ఎవరికి అప్పగించారు, ఈ శిశువు ఎవరికి చెందుతుందనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు. కానీ తమ తప్పును ఒప్పుకుంటూ ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు మోనాష్ ఐవీఎఫ్ సంస్థ వివరించింది. అలాగే రీ ప్రొడక్టివ్ టెక్నాలజీ అక్రిడేషన్ కమిటీతో పాటు ఇతర నియంత్రణ సంస్థలకు కూడా దీని గురించి సమాచారం ఇచ్చినట్లు స్పష్టం చేసింది. న్యూ క్వీన్స్‌లాండ్ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేటర్‌కు కూడా తాము స్వచ్ఛందంగానే సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com