ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి ఆలయం వద్దకు చెప్పులతో భక్తులు ప్రవేశించిన ఘటనపై.. టీటీడీ సీరియస్..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 13, 2025, 05:51 PM

తిరుమలలో అపచారం ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం సీరియస్ అయ్యింది. సిబ్బందిపై చర్యలు తీసుకుంది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఏడుగురు సిబ్బందిని టీటీడీ సస్పెండ్ చేసింది. టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశాలతో ఏడుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఫుట్‌పాత్ హాల్, డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఇద్దరు టీటీడీ సిబ్బందిని, ఐదుగురు సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేశారు. చక్రపాణి అనే సీనియర్ అసిస్డెంట్, వాసు అనే జూనియర్ అసిస్టెంట్‌తో పాటుగా ఐదుగురు భద్రతా సిబ్బందిని టీటీడీ సస్పెండ్ చేసింది. మరోవైపు విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఆరుగురు ఎస్పీఎఫ్‌ సిబ్బందిని సస్పెండ్‌ చేయాలని ఎస్పీఎఫ్‌ డైరక్టర్‌ జనరల్‌కు ప్రతిపాదించింది.


తిరుమల శ్రీవారిని నిత్యం అనేక మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. సాధారణ భక్తుల నుంచి వీవీఐపీల వరకూ స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు చెందిన కొంతమంది భక్తులు శనివారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. శ్రీవాణి టికెట్ మీద శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1 మీదుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అయితే వీరిలో అభిషేక్, ముకేష్ అనే భక్తులు డిస్పోజబుల్ ఫుట్ వేర్ (పాదరక్షలు) ధరించి ఆలయం మహద్వారం వద్దకు చేరుకున్నారు. మహద్వారం వద్ద టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది ఈ విషయాన్ని గమనించారు. వాటిని తొలగింపజేశారు.


అయితే సాధారణంగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లేటప్పుడు భక్తులు మాడవీధుల్లో పాదరక్షలు ధరించడం నిషిద్ధం. టీటీడీ సిబ్బంది పాదరక్షలు ధరించడాన్ని అనుమతించరు. అయితే మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులకు ఈ విషయం తెలియకపోవటంతో చెప్పులతోనే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించారు. అయితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది సరిగా చెకింగ్ చేయపోవటంతో.. శ్రీవారి ఆలయ మహద్వారం వరకూ చెప్పులతోనే వచ్చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా.. భక్తులు, నెటిజనం నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుగురిని సస్పెండ్ చేసింది. విధుల్లో అలసత్వం వహించారనే కారణంతో ఏడుగురు సిబ్బందిని సస్పెండ్ చేసింది. మరో ఆరుగురిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com